Idream media
Idream media
ఏదైనా సంఘటన, ప్రమాదం జరిగినప్పుడు కొంత మంది పాలకుల మాటలు కోటలు దాటుతాయి. ప్రమాదం మళ్లీ జరగకుండా చూస్తామని, కారకులపై చర్యలు తీసుకుంటామని, బాధితులను ఆదుకుంటామని పలు రకాల హమీలు గుప్పిస్తుంటారు. కొద్ది రోజుల తర్వాత ఆ మాటలను పూర్తిగా మరిచిపోయిన ఘటనలు ఎన్నో చూశాం. ముఖ్యమంగా కారకులపై చర్యలు ఏమయ్యాయో తెలియదు కానీ బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలని అధికారులు, నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు.
అయితే అందుకు విరుద్ధంగా చెప్పిన ప్రతి మాటను, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జగన్ సర్కార్ సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. ఇందుకు విశాఖ సమీపంలోని ఆర్ ఆర్ వెంకటాపురంలో జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదం తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నాయి. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున, బాధితులకు 10 వేల నుంచి 10 లక్షల రూపాయల వరకూ పరిహారం ప్రభుత్వం రోజుల వ్యవధిలో చెల్లించింది.
అంతేకాదు ప్రమాదకరమైన సై్టరిన్ వాయువును పీల్చడం వల్ల భవిష్యత్లో బాధిత గ్రామాల ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయన్న అనుమానంతో వారి ఆరోగ్యంపై కూడా భవిష్యత్లో ఇబ్బంది లేకుండా గ్రామంలోనే ఆస్పత్రి, ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ఆరోగ్య కార్డులు అందజేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆస్పత్రిని ప్రారంభించారు. తాజాగా ఇచ్చిన హామీని కేవలం రెండు నెలల్లోనే జగన్ ప్రభుత్వం అమలు చేసింది. ఈ రోజు ఆర్ ఆర్ వెంకటాపురంలో వైఎస్సార్ క్లినిక్ పేరుతో శాశ్వత భవనంలో ఆస్పత్రిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రాథమికంగా వైద్యం చేయించుకునేందకు ఈ ఆస్పత్రిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.