Idream media
Idream media
తెలంగాణలో కొత్త పార్టీ పురుడుపోసుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ.. వైఎస్ షర్మిళ పార్టీని ఏర్పాటు చేశారు. తన తండ్రి పేరుపై వైఎస్సార్ తెలంగాణ పార్టీగా నామకరణం చేశారు. ఇప్పటికే పార్టీ పేరును ప్రకటించిన వైఎస్ షర్మిళ.. ఈ రోజు అధికారికంగా పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించబోతున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు పంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత షర్మిళ తన పార్టీ విధివిధానాలను ప్రకటించబోతున్నారు.
తన తండ్రి జన్మదినం రోజున పార్టీని ప్రకటిస్తున్న వైఎస్ షర్మిళ.. ముందుగా తన తండ్రి ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇడుపులపాయ వెళ్లిన షర్మిళ.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తల్లి విజయమ్మ, కుటుంబంతో కలసి ప్రత్యేక ప్రార్థణలు చేశారు. అనంతరం తన పార్టీ జెండాను తండ్రి సమాధిపై ఉంచి ఆశీస్సులు పొందారు.
ఆత్మగౌరవ తెలంగాణే లక్ష్యంగా.. రాజన్న రాజ్యం రావాలన్నదే తన అభిమతమని వైఎస్ షర్మిళ ఇప్పటికే ప్రకటించారు. పార్టీ ఏర్పాటుకు ముందు తెలంగాణలో జిల్లాల వారీగా వైఎస్సార్ అభిమానులతో భేటీ అయిన షర్మిళ.. పార్టీ ఏర్పాటుపై వారి అభిప్రాయాలు, సలహాలు తీసుకున్నారు. అనంతరం ఖమ్మంలో నిర్వహించిన సభలో తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు.. పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు.
Also Read : తిట్టిన నోరే పొగుడుతోంది..!