iDreamPost
android-app
ios-app

కాపు రిజర్వేషన్ల ఉద్యమ కేసుల ఉపసంహరణ

కాపు రిజర్వేషన్ల ఉద్యమ కేసుల ఉపసంహరణ

కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించి తుని విధ్వంసం ఘటనలో మరో 17 కేసులల్లో విచారణను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన 17 కేసులను ఉపసంహరిస్తున్నట్టు ఉత్తర్వులు విడుదల చేశారు హోమ్ శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్. డిజీపి సిఫార్సుల మేరకు ఈ కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోమ్ శాఖ పేర్కొంది. నమోదైన 69 కేసులకు గాను ఇప్పటికే 51 కేసులను గత ఏడాది ప్రభుత్వం ఉపసంహ రించింది.

టీడీపీ హయాంలో..

తూర్పు గోదావరి జిల్లాలో కాపు ఉద్యమానికి సంబంధించి తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో 2016 జనవరిలో తునిలో ఆందోళనలు జరిగాయి. రైలు దహనం, స్థానిక పోలీస్‌ స్టేషన్‌పై దాడులకు సంబధించి కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో 51 మందిపై నమోదైన కేసులకు వెనక్కు తీసుకుంటున్నట్లు గతంలోనే ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ జీవో నెంబర్‌ 312జారీ చేసింది. అప్పట్లో జరిగిన ఆందోళనలకు సంబంధించి కేసులన్నీ ఎత్తివేయాలని గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది.

అందులో భాగంగా తుని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏడుగురు నిందితులపై క్రైం నెంబర్‌ 07/16 నుంచి 33/2016 వరకు 147,435 సెక్షన్ల కింద నమోదైన కేసులు ఎత్తివేశారు. తుని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మరికొందరిపై క్రిమినల్‌ లా అమెండమెంట్‌ మరియు ఐపీసీ 143,147,148, 353,435,149,427,109,440 సెక్షన్ల కింద కేసులు నమోదుకాగా వాటన్నింటిని ఉప సంహరించుకున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అలాగే రైలు దహనం కేసులో క్రైం నెంబర్‌ 18/2016 నుంచి 22/2016 వరకు అయిదుగురిపై నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తున్నట్లు వివరించింది. వీరిపై జీఆర్పీ పోలీసులు 147,148,353,438, 120-బీ ఆర్‌/డబ్ల్యూ 149 సెక్షన్ల కింద అప్పట్లో కేసులు నమోదుచేశారు. వీటిని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాగా కేసులు ఎత్తివేసిన 51 మంది నిందితుల్లో 39మంది తుని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్నారు.

2016జనవరిలో తునిలో కాపు ఉద్యమ ఆందోళనకు సంబంధించి రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమం జరిగింది. దీనికి 13 జిల్లాల నుంచి కాపు నేతలు హాజరయ్యారు. ఈక్రమంలో తుని, తుని రూరల్‌ స్టేషన్ల పరిధిలో 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై కాపు ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. అదే సమయంలో విజయవాడవైపు వెళ్తున్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళనకారులు తగులబెట్టారు. అదే సమయంలో తుని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన ప్రభుత్వం ఆందోళనకారులపై పలు కేసులు నమోదు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కేసులను ఉప సంహరించుకుంటూ వచ్చింది.