ప్రభుత్వం విపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకోవడం సహజం కానీ ప్రస్తుతం టిఆర్ఎస్ నాయకులు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను టార్గెట్ చేసి వరుసగా విమర్శలు చేస్తున్నారు. మొదటి నుంచి కెసిఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒంటికాలుమీద లేస్తూ తీవ్ర విమర్శలు చేసిన ధర్మపురి అరవింద్ ను టిఆర్ఎస్ నాయకులు లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ధర్మపురి అరవింద్ ఒక విమర్శ చేస్తే టిఆర్ఎస్ రెండు విమర్శలు చేస్తోంది.
అసలు విషయం ఏంటని అరా తీస్తే బీజేపీలో అర్వింద్ కీలక నేతగా ఎదగడానికే కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నాడని తెలుస్తోంది. దింతో అర్వింద్ స్పీడ్ కు బ్రేకులు వేయాలని నిజామాబాద్ టిఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. బిజెపి నుంచి గెలిచిన బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అర్వింద్, సోయం బాబురావు నలుగురు ఎంపీలలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గా వెళ్లగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ధర్మపురి అరవింద్ ఎంపీగా కొనసాగుతున్న రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు రావడం లేదని భావిస్తున్నారట. అందుకని టిఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర, జాతీయ స్థాయిలో విమర్శలు చేస్తూ బిజెపిలో కీలక నేతగా ఎదగాలని భావిస్తున్నారు. గతంలో బండి సంజయ్ తో టిఆర్ఎస్ ను విమర్శించిన అర్వింద్ తనకు గుర్తింపు రావడం లేదని బండి సంజయ్ వర్గానికి దూరంగా ఉంటున్నాడు. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన కూడా తనకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదని ధర్మపురి అరవింద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అంశాలవారిగా సందర్భo ఏదైనా టిఆర్ఎస్ ను తనదైన స్టైల్ లో కడిగి పడేస్తున్నారు. ఒక్కోసారి విమర్శలు శృతి మించి ఉంటున్నాయి. ఎంపీ అయి ఉండి హుందాగా వ్యవహరించాలని ఎవరైనా అడిగితే కేసీఆర్ &బ్యాచ్ వాడే భాష ఇదే కాబట్టి వాళ్లకు అదే భాషలో చెప్తే అర్థం అవుతుందని కౌంటర్ ఇస్తున్నాడు. కేంద్రాన్ని, బీజేపీని ఒక్కమాట అన్న ఊరుకోవడం లేదు తోక త్రొక్కిన పాములా లేస్తూ టిఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. టిఆర్ఎస్ ఆరోపణలకు వెంటనే కౌంటర్ ఇస్తూ జాతీయ నాయకత్వం దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు టిఆర్ఎస్ ప్రభుత్వం సహకరించడం లేదని కోపంతో అరవింద్ టీఆర్ఎస్ పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
Also Read : అదే జరిగితే ఉత్తరాది పెత్తనం పెరుగుతుందా..?
దీంతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు అరవింద్ పై ఎదురుదాడికి దిగుతున్నారు 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవితను ఓడించి నిజామాబాద్ ఎంపీ గెలవడం, కేసీఆర్ పై డైరెక్ట్ విమర్శలు చేయడం జిల్లా టిఆర్ఎస్ నాయకులకు మింగుడు పడడం లేదు.
జిల్లాలో, బిజెపిలో కీలక నేతగా ఎదుగుతున్న అరవింద్ స్పీడ్ కు బ్రేక్ వేయాలని టిఆర్ఎస్ హైకమాండ్ నుండి సిగ్నల్స్ రావడంతో జిల్లా నాయకులు రంగంలోకి దిగారు.అరవింద్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వరుస విమర్శలు చేస్తున్నారు. పసుపు బోర్డు విషయంలో అరవింద్ మాట తప్పి రైతులను మోసం చేశారని, ఒకే ఇంట్లో మూడు పార్టీలు ఉన్నాయని ముందు ఇంట్లో గెలిచిన తర్వాత జిల్లాలో మాట్లాడాలని టిఆర్ఎస్ నేతలు హితవు పలుకుతున్నారు. తన స్థాయి మర్చిపోయి సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నాడని ఇప్పటికైనా తన స్థాయి ఏంటో తెలుసుకోవాలని టిఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు.
బిజెపి, టిఆర్ఎస్ నేతల వరుస విమర్శలతో ఇందూరు రాజకీయం వేడెక్కింది. ధర్మపురి అరవింద్ వన్ మెన్ ఆర్మీ గా టీఆర్ఎస్ నాయకులకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. కానీ టిఆర్ఎస్, బిజెపి పార్టీల ఆధిపత్య ధోరణి తో జిల్లాలో అభివృద్ధి జరగడం లేదని ఇప్పటికైనా పార్టీలు తమ రాజకీయ ఎజెండాలను పక్కనపెట్టి జిల్లా అభివృద్ధి మీద దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Also Read : రేవంత్ పలాయనం