iDreamPost
iDreamPost
తిరుపతికి సమీపంలో ఉన్న అమరరాజా ప్లాంట్ తరలిస్తున్నారంటూ పచ్చ మీడియా చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇప్పటికే అనేకమార్లు ఏదో జరిగిపోతోందనే హడావిడి చేయడం, ఆ తర్వాత అలా కాదంట అంటూ మళ్లీ వాళ్లే వివరణ ఇవ్వడం అలవాటుగా మార్చుకున్నారు అమర రాజా విషయంలో కూడా అదే జరిగింది. అంతకుముందు కియా వ్యవహారం సహా అనేక సందర్భాల్లోనూ జరిగింది.
అమరరాజా పరిశ్రమను తమిళనాడుకి తరలిస్తున్నారని, ఏపీలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని, జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఇలా అనేక విధాలుగా సాగించిన ప్రచారం పూర్తిగా వాస్తవదూరమని వెల్లడయ్యింది. నిజానికి పరిశ్రమ యజమానుల కన్నా ఆంధ్రజ్యోతి యాజమాన్యానిదే ఎక్కువ ఆతృత అని తేలింది. జగన్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చేసిన ఎత్తుగడగా ఇది కనిపిస్తోంది. ప్రజలను పక్కదారిపట్టించి ప్రతిపక్ష ప్రయోజనాల పరిరక్షణలో సదరు పచ్చ మీడియా పూర్తిగా నిమగ్నమై ఉన్నట్టు తేటతెల్లమయ్యింది.
వాస్తవానికి అమరరాజా కంపెనీ కాలుష్య నియంత్రణలో నిబంధనలు పాటించడం లేదన్నది వాస్తవం. దానికి సంబంధించి కంపెనీ వేసిన పిటీషన్ విచారణ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. పైగా చెన్నై ఐఐటీ టీమ్ తో విచారణను అడ్డుకోవడం తగదంంటూ కూడా కోర్టు చెప్పింది. అయితే క్లోజర్ నోటీసులకు సంబంధించి ఆగష్టు 16న తదుపరి విచారణను ఏపీ హైకోర్టు చేపట్టబోతోంది. ఈలోగా వ్యవహారం కోర్టు విచారణలో ఉండగా తాము తరలింపు సహా ఇతర విషయాలపై మాట్లాడలేమని సంస్థ కొత్త చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గల్లా జయదేవ్ ప్రకటించారు. అదే సమయంలో చైర్మన్ హోదా నుంచి తప్పుకుంటున్న సమయంలో గల్లా రామచంద్రనాయుడు మాత్రం తరలింపు ఆలోచన లేదని తేల్చేశారు. తద్వారా జ్యోతితో పాటుగా ఈనాడు వంటి పత్రికలు కూడా చేసిన ప్రచారంలో వాస్తవం లేదని బహిరంగమయ్యింది.
అయినప్పటికీ ఆంధ్రజ్యోతి రాతల్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ధోరణి తగ్గడం లేదు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే వివరణ ఇచ్చిన అంశాలను మళ్లీ ప్రస్తావించడం జ్యోతి లక్ష్యాలను చాటుతోంది. అమరరాజా విషయంలో ప్రభుత్వానికి ఉద్దేశాలు లేవని, కాలుష్య నియంత్రణకు కట్టుబడి పరిశ్రమ కొనసాగిస్తే ఎవరు కాదంంటారని కూడా సజ్జల స్పష్టతనిచ్చారు. వాటిపై వ్యాఖ్యానించడానికి అమర రాజా సంస్థ అంతగా ఆసక్తి చూపలేదు. కోర్టు పరిధిలో ఉందని గల్లా జయదేవ్ ప్రకటించారు.అయినా ఆంధ్రజ్యోతి మాత్రం సజ్జల ప్రకటనను ముందుకు తీసుకొచ్చి ఏపీలో పరిశ్రమ వర్గాల్లో అనుమానాలు పెంచాలనే కుయత్నాన్ని ప్రదర్శించడం విశేషం.
ప్రపంచమంతా కరోనా విపత్తులు కారణంగా కుంటుపడిన పారిశ్రామిక అభివృద్ధి ఒక్క ఏపీలోనే ఆగిపోయిందని చిత్రీకరించడానికి సిద్ధపడిన పచ్చ మీడియా, ఇప్పుడు ఉన్న పరిశ్రమలను కూడా తరలించేలా తానే వక్రరాతలతో ముందుకు రావడం విడ్డూరంగా మారింది. రాష్ట్రానికి నాలుగు పెట్టుబడులు రావాలి..నాలుగు పరిశ్రమలు ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం దానికి విరుద్ధం. జగన్ హయంలో ఏమీ జరగకూడదనే కుట్రలతో ఏపీలో ఉన్న పరిశ్రమవర్గాలను కూడా భయపెట్టడానికి సిద్ధమవుతోంది. అనుమానాలు ప్రేరేపించే రాతలతో నిత్యం అవాస్తవాలు వండివార్చుతోంది. అమరరాజా దానికి తాజా ఉదాహరణ. ప్రజల్లో ఇలాంటి అపోహలు పెంచే ప్రయత్నం చేస్తున్న పత్రికల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.
Also Read : అమరరాజా తరలింపు పుకారు మాత్రమే : గల్లా జయదేవ్