iDreamPost
android-app
ios-app

విపక్షం ఉన్నది బురద జల్లడానికేనా?

  • Published Jan 21, 2022 | 2:50 PM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
విపక్షం ఉన్నది బురద జల్లడానికేనా?

అధికారపక్షంపై బురద జల్లడమే ప్రతిపక్షం పని అని టీడీపీ నేతలు భావిస్తున్నారా అన్న అనుమానం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఎవరికైనా కలుగుతుంది. రాష్ట్రం డ్రగ్స్‌ ఆంధ్రాగా మారిపోయింది, గంజాయి రవాణాకు అడ్డాగా మారింది, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిపోయింది వంటి నిరాధారమైన ఆరోపణలు చేసి ఇన్నాళ్లూ ప్రభుత్వంపై టీడీపీ బురద జల్లింది. ఏ మాత్రం బాధ్యత లేకుండా ఇటువంటి ఆరోపణలు చేసి, వాటికి తమ అనుంగు మీడియాలో విస్తృత ప్రచారం కల్పించి ప్రభుత్వాన్ని జనంలో చులకన చేయడమే పనిగా పెట్టుకుంది. అదే తరహాలో టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప కూడా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మాజీ హోం మంత్రి కూడా అయిన రాజప్ప అందరి నాయకుల్లాగే పోలీసు వ్యవస్థపైన, డీజీపీపైన గాలి ఆరోపణలు చేయడం గమనార్హం.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడివాడలో మంత్రి కొడాలి నాని కనుసన్నల్లోనే జూద క్రీడలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గుడివాడలో టీడీపీ నేతలపై వైఎస్సార్‌ సీపీ రౌడీల దాడి దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఎందరో మహనీయులు పుట్టిన గుడివాడను కొడాలి నాని అక్రమ సంపాదన కోసం భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ నేతల అక్రమాలను బయటపెడితే భౌతికదాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఏపీలో వైఎస్సార్‌ సీపీ రౌడీమూకలు రెచ్చిపోతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు. వైఎస్సార్‌ సీపీ నేతలు సంఘ విద్రోహశక్తుల్లా మారారని రాజప్ప ఆవేశపడిపోయారు.

మంత్రి చెప్పేది వినిపించుకోరా?

టీడీపీ చేస్తున్న క్యాసినో ఆరోపణలపై మంత్రి కొడాలి నాని ఇస్తున్న వివరణను పట్టించుకోకుండా ఏకపక్షంగా టీడీపీ నేతలు నిజనిర్ధారణ కమిటీ అంటూ రోడ్డెక‍్కడం కేవలం రాజకీయ డ్రామా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదోవిధంగా సీన్‌ క్రియేట్‌ చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే దురుద్దేశం తప్ప టీడీపీ నేతలకు తాము చేసే ఆరోపణలను నిరూపించాలన్న ధ్యాసలేదని వైఎస్సార్‌ సీపీ నాయకులు అంటున్నారు.

తన కళ్యాణ మంటపంలో క్యాసినో పెట్టానని నిరూపిస్తే..రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. ఇక్కడే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని మంత్రి కొడాలి నాని చెప్పేదానికి టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారు. ఎక్కడో జరిగిన దృశ్యాలు తీసుకువచ్చి తన కన్వెన్షన్‌లో జరిగినట్టుగా చూపిస్తున్నారని కొడాలి నాని అంటున్నారు. క్యాసినో పెట్టలేదని నిరూపణ అయితే టీడీపీ నేతలు ఏం చేస్తారని ఆయన విసురుతున్న సవాల్‌కు ఎందుకు స్పందించడం లేదు?

ఏ అనుమతి తీసుకోకుండా ఒక ప్రైవేటు కళ్యాణ మంటపంలోకి నిజ నిర్ధారణ కమిటీ పరిశీలనకు అంటూ వెళితే అనుమతిస్తారా? వైఎస్సార్‌ సీపీ రౌడీమూకలు రెచ్చిపోతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్న చినరాజప్ప టీడీపీ పంపిన నిజ నిర్ధారణ బృందం నాయకులే రౌడీమూకల మాదిరి వ్యవహరించారని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నదానికి ఏం సమాధానం చెబుతారు? ఏదో ఒక అంశాన్ని తీసుకొని ముఖ్యమంత్రికి, డీజీపీకి ముడిపెట్టేసి ఆరోపణలు చేసేయడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిపోయింది. దానికి మాజీ హోం మంత్రి అయిన రాజప్ప కూడా మినహాయింపు కాదని అర్థమవుతోంది.