గత శనివారం శ్వాస సంబంధ సమస్యలతో ఎయిమ్స్లో చేరిన కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా గురువారం సాయంత్రం డిశ్ఛార్జ్ అయ్యారు. కాగా అమిత్ షాకు ఆగస్టు 2 న కరోనా పాజిటివ్ అని నిర్దారణ కాగా కరోనాతో పోరాడి తిరిగి కోలుకున్నారు. ఆగస్టు 14 న అమిత్ షాకు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ అని రావడంతో ఆయనను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. కానీ నాలుగు రోజుల తర్వాత మరోసారి శ్వాస కోస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడటంతో ఆగస్టు 18న ఎయిమ్స్ పోస్ట్-కోవిడ్ కేర్ సెంటర్లో చేరి రెండువారాల చికిత్స అనంతరం ఆగస్టు 31న డిశ్చార్జ్ అయ్యారు.
కానీ మరోసారి శ్వాసకు సంబంధించిన సమస్యలు తిరగబెట్టడంతో ఈ నెల 12 న శనివారం రాత్రి ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో ఐదు రోజులు ఉన్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో ఎయిమ్స్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. అనంతరం తన నియోజకవర్గమైన గాంధీనగర్లో జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.