iDreamPost
android-app
ios-app

తెలంగాణ ఈఎస్ఐ స్కాం : బ‌య‌ట‌ప‌డ్డ నోట్ల క‌ట్ట‌లు

తెలంగాణ ఈఎస్ఐ స్కాం : బ‌య‌ట‌ప‌డ్డ నోట్ల క‌ట్ట‌లు

ఈఎస్ఐ స్కాం జాడ‌లు తెలంగాణ‌లో త‌వ్వే కొద్దీ బ‌య‌ట‌ప‌డుతున్నాయి. గ‌త పాల‌కుల హ‌యాంలో జ‌రిగిన అవినీతి ఊట వెలుగులోకి వ‌స్తోంది. ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌)లో మందుల కొనుగోళ్లలో జరిగిన అవినీతి జాడలు తవ్వినకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. గతేడాది బ‌య‌ట‌ప‌డ్డ ఈ కేసు మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌లో పెను సంచలనాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా కోట్లాది రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌ల‌ను అధికారులు సీజ్ చేశారు. ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ దేవికారాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. ఆమె రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీ లను సైతం మంగళవారం వెలుగులోకి తెచ్చింది. దేవికారాణి సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఓ రెసిడెన్షియల్‌ వెంచర్‌లో చదరపు అడుగుకు రూ.15 వేల విలువ కలిగిన 6 ఫ్లాట్లను కుటుంబ సభ్యుల పేరిట కొనేందుకు ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మితో కలిసి రూ.4.47 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. ఇందులో దేవికారాణి వాటా రూ.3.75 కోట్లు కాగా, ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మి వాటా రూ.72 లక్షలని ఏసీబీ తేల్చింది. ఈ మొత్తం.. లెక్కల్లోలేని నగదుగా గుర్తించింది. ఈ పెట్టుబడుల్లో రూ.22 లక్షలు బినామీదార్ల పేరిట దేవికారాణి ఇన్వెస్ట్‌ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లాట్ల కొనుగోలుకు రూ.2,29,30,000 మొత్తాన్ని చెక్కులు, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ఆమె చెల్లించినట్టు చెప్పారు.

ఊపందుకున్న ద‌ర్యాప్తు

తెలంగాణ ఈఎస్‌ఐ స్కాం కేసులో ఏసీబీ దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితురాలుగా ఉన్న మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయట పడుతోంది. ప‌ట్టుబ‌డ్డ రూ. 4 కోట్ల 47 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ప్రకారం బంగారపు ఆభరణాలు ఎక్కడికి తరలించారు అన్న అంశాలపై ఏసీబీ విచారణ చేస్తోంది.ఇంట్లో దొరికిన పత్రాల ఆధారంగా 10 కోట్ల బంగారు ఆభరణాలు రహస్య ప్రాంతంలో దాచిపెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. స్కామ్ లో అరెస్ట్ చేసిన తర్వాత ఆమె కు సంబంధించిన 35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి ఏసీబీ సీజ్ చేసింది. అయితే బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 200 కోట్ల ఉందంటున్న ఏసీబీ భావిస్తోంది. దేవికారాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ఏసీబీ నమోదు చేసింది. ఒక పక్క విచారణ కోనసాగుతుండగానే నిందితులు తమ ఆస్తులను, బంగారపు ఆభరణాలను పక్క ప్లాన్ తో దారి మళ్లించినట్లు ఏసీబీ భావిస్తోంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 25 మంది నిందితులకు సంబంధించిన వందల కోట్ల ఆస్తులను ఏసీబీ సీజ్‌ చేసింది. ఇప్పుడు మళ్ళీ నిందితులకు సంబంధించి కోట్ల రూపాయలు బయట పడడంతో ఏసీబీ షాక్ గురైంది.

త‌హ‌సీల్దార్ నాగ‌రాజు రికార్డు బ్రేక్

ఈ కేసుకు సంబంధించి ఓ వెంచర్‌ డెవలపర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. ఆస్తులు అటాచ్‌ చేస్తామంటూ నోటీసుల్లో హెచ్చరించారు. గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో తన ఖాతాకు దేవికారాణి, నాగలక్ష్మి పంపిన మొత్తం డబ్బును సదరు డెవలపర్‌ డ్రా చేశాడు. ఏబీకి తిరిగి అప్పగించాడు. భారీ మొత్తం కావడంతో రూ.500, రూ.2,000 నోట్లకట్టలు నాలుగు టేబుళ్లను ఆక్రమించాయి. తాజా ఉదంతంలో రూ.4.47 కోట్లు దొరకడంతో కీసర తహసీల్దార్‌ వద్ద లభించిన రూ.కోటీ పది లక్షల రికార్డును తిరగరాసినట్‌లైంది. దేవికారానికి నోటీసులు ఇచ్చి మరోసారి విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.