ఇంకా టైటిల్ డిసైడ్ చేయలేదు కానీ షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ బోయపాటి శీను సినిమా అప్పుడే బిజినెస్ సర్కిల్స్ లో హాట్ కేక్ గా మారింది. ఇప్పటిదాకా 55 కోట్ల రూపాయల మేరకు థియేట్రికల్ డీల్స్ వచ్చినట్టు సమాచారం. ఇందులో ఒక్క ఆంధ్రా నుంచే 35 కోట్ల దాకా ఆఫర్ చేసినట్టు వినికిడి. ఇంకా నిర్మాణంలో ఉండగానే ఇంత క్రేజ్ రావడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. వాస్తవానికి బాలయ్య ఇమేజ్ కి రేంజ్ కి ఇదేమంత పెద్ద మొత్తం కాదు. అయితే గత కొంతకాలంగా నందమూరి హీరో ట్రాక్ చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా రూలర్ లాంటి కళాఖండం అభిమానులకు సైతం నచ్చలేదు.
అలాంటిది ఇంత మొత్తంలో పెట్టుబడులు సాగుతున్నాయంటే విశేషమే. అయితే ఇక్కడ అన్నింటి కన్నా ఎక్కువ వర్కౌట్ అవుతున్న అంశం హ్యాట్రిక్ కాంబినేషన్. గత కొన్నేళ్లలో బాలయ్యకు దక్కిన అతి పెద్ద బ్లాక్ బస్టర్లు సింహా, లెజెండ్ లు రెండింటి దర్శకుడు బోయపాటినే. అందుకే ఈసారి మరింత ఎక్కువగా ఆ మేజిక్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు. తమన్ మొదటిసారి బాలకృష్ణకు సంగీతం అందించడం కూడా అంచనాలు పెంచుతోంది. చాలా నెలల క్రితం వదిలిన టీజర్ తాలూకు ఫలితాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. సో మాస్ ఆడియన్స్ కి గట్టి ట్రీటే ఇవ్వబోతున్నారన్న మాట.
ప్రగ్య జైస్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ విలన్ గా చేయడం విశేషం. ఫ్యాక్షనిస్ట్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా, అఘోరాగా బాలయ్య డిఫరెంట్ షేడ్స్ లో ఇందులో కనిపించబోతున్నారు. రివెంజ్ డ్రామా తరహాలో ఉండొచ్చనే టాక్ ఉంది. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ లు కనీస స్థాయిలో ఆడకపోవడంతో వాటి ఎఫెక్ట్ బిబి3 మీద పడుతుందేమో అనుకుంటే అలాంటిదేమి జరగలేదు. సో నో టెన్షన్. అన్నట్టు టైటిల్ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. చాలా పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఆఖరికి మోనార్క్ కే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారనేది ఇన్ సైడ్ న్యూస్.