iDreamPost
android-app
ios-app

మూడో టెస్టులో పట్టుబిగించిన ఆస్ట్రేలియా – టీమ్ ఇండియా లక్ష్యం 407 పరుగులు

మూడో టెస్టులో పట్టుబిగించిన ఆస్ట్రేలియా – టీమ్ ఇండియా లక్ష్యం 407 పరుగులు

భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆరో వికెట్‌లు కోల్పోయి 312 పరుగులు సాధించి ఇన్నింగ్స్‌ని డిక్లేర్డ్‌ చేసింది.. దీంతో టీమ్ ఇండియా లక్ష్యం 407 పరుగులుగా నమోదైంది. కామెరాన్‌ గ్రీన్‌(84; 132 బంతుల్లో 8×4, 4×6),స్టీవ్ స్మిత్(81; 167 బంతుల్లో 8×4,1×6) టిమ్‌పైన్‌(39*; 52 బంతుల్లో 6×4) రాణించారు.

103/2 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి సెషన్‌ పూర్తయ్యేసరికి 182/4తో నిలిచింది. తొలి సెషన్‌లో లబుషేన్‌(73), మాథ్యూవేడ్‌(4) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. అనంతరం స్మిత్‌, గ్రీన్‌ ఐదో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది.. ఈ దశలో స్మిత్‌ని అశ్విన్ ఎల్బీగా ఔట్ చేయడంతో వెనుతిరిగాడు.ధాటిగా బ్యాటింగ్ చేసిన గ్రీన్‌ టిమ్‌పైన్‌(38)తో కలిసి 104 పరుగుల శతక భాగస్వామ్యం నిర్మించాడు. బుమ్రా బౌలింగ్‌లో గ్రీన్ కీపర్‌ సాహా చేతికి చిక్కి పెవిలియన్‌ చేరడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేస్తున్నట్లు కెప్టెన్ టిమ్ ఫైన్ ప్రకటించాడు.అప్పటికి ఆస్ట్రేలియా 87 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. దాంతో 406 పరుగుల ఆధిక్యాన్ని సాధించడంతో 407 పరుగుల లక్ష్యాన్ని టీమ్ ఇండియాకి నిర్దేశించింది.

అనంతరం 407 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా 46 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 22, గిల్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.