iDreamPost
iDreamPost
మీడియా కొద్దిమంది చేతుల్లో ఉన్న సమయంలో వాళ్లు చెప్పిందే వేదం. సినిమా యాక్టర్ ని కూడా దేవుడిని చేసేటంత సామర్థ్యం ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. సోషల్ మీడియా యుగంలో వాస్తవాలను దాచిపెట్టడం, అవాస్తవాలతో అందరినీ నమ్మించడం అసలు సాధ్యం కాదు. ఇది ఏ ఒక్కరికీ పరిమితం కాదు.. అందరికీ వర్తించే వర్తమాన వాస్తవం. అయినా తెలుగుదేశం పార్టీ ఇంకా పాతకాలపు ఆలోచనలకే పరిమితం అయిపోయింది. తామేది చెప్పినా జనం నమ్మేస్తారనే చంద్రబాబు నమ్మకానికి నిజంగా సలాం చేయాలి.
విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దుల్లో లేటరైట్ తవ్వకాలకు టీడీపీ ప్రభుత్వమే అనుమతినిస్తుంది. అంతేకాదు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణాన్ని అనుకుని గ్రావెల్ కొండలను చంద్రబాబు పాలనలోనే పూర్తిగా తరలించేస్తారు. కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు లైటరైట్ అని ఇప్పుడు మాత్రం బాక్సైట్ అంటూ బుకాయించే ప్రయత్నం చేస్తారు. దానిని అడ్డుకోవడానికి తోచింది రాస్తూ, అందరూ నమ్మేయాలని రాజకీయ డ్రామాలకు కూడా తెరలేపుతారు. పైగా కేవలం ఎస్సీ, ఎస్టీ నేతలను మాత్రమే రంగంలో దింపి వ్యవహారాన్ని మరింత నాటకీయంగా మార్చే యత్నం చేస్తుంటారు.
Also Read : ఫిర్యాదు సరే.. ఫలితమేది సోమిరెడ్డి..?
నర్సీపట్నం నియోజకవర్గంలో పరిధిలోని నాతవరంలో లేటరైట్ తవ్వకాలను ఆనాటి మంత్రి అయ్యన్నపాత్రుడు అడ్డగోలుగా సాగించారు. అనేక ఆరోపణలు వచ్చినా ఆపలేదు. పైగా అనుమతులు లేని ప్రాంతాల్లో కూడా తవ్వకాలు చేసినట్టు అప్పట్లో స్థానికులు ఆందోళనలకు కూడా పూనుకున్నారు. అయినా తాము చేసింది మాత్రమే వ్రతం,..ఇతరులు చేస్తే అది వ్యభిచారం అనేది టీడీపీ నేతలు బాగా ఒంటబట్టించుకున్న సిద్ధాంతంలా తయారయ్యింది. తమ హయంలో వంతాడ నుంచి పెద్దాపురం వరకూ దొరికిన ప్రతీ ఖనిజాన్ని కొల్లగొట్టేసి ఇప్పుడు మాత్రం నీతులు వల్లించడానికి సిద్ధమవుతున్న తీరు విస్మయకరంగా మారుతోంది.
విశాఖ జిల్లాలో ఎలాంటి అక్రమ తవ్వకాలు జరగకపోగా, ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో జరుగుతున్న లేటరైట్ కి అసలు బాక్సైట్ తో సంబంధం లేదు. ఇప్పటికే ఇది రుజువవుతున్నా ఒక అబద్ధం వంద సార్లు చెప్పడం ద్వారా నిజాన్ని మసకబార్చే యత్నం జరుగుతోంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కూడా బాక్సైట్ కి ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాలకు సంబంధం లేదని తేల్చాయి. అయినా టీడీపీకి అది కూడా పడుతున్నట్టుగా లేదు. జీఎస్ఐ, ఐబీఎం రిపోర్టులను కాదని ఆంధ్రజ్యోతి, ఈనాడు రిపోర్టులే జనం నమ్మాలని చెప్పడానికి కూడా సిద్ధపడుతున్నారంటే ఆశ్చర్యమే. చంద్రబాబు హయంలో బాక్సైట్ తవ్వకాలకు విస్తృతంగా ప్రయత్నం చేశారు. రస్ ఆల్ ఖైమా సారధ్యంలో దానికి శ్రీకారం చుట్టారు. కానీ జగన్ మాత్రం తాను అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని మరుగునపరిచే యత్నంలో టీడీపీ నేతలున్నట్టు కనిపిస్తోంది.
నిరాధారంగా ఆరోపణలు, చివరకు ఆందోళనలకు కూడా పూనుకుంటూ అందరినీ నమ్మించగలమనే వైఖరి టీడీపీ తీసుకోవడం విశేషమే. దాని మూలంగా ఫలితాలు రావని ఇప్పటికే తేటతెల్లమయినప్పటికీ టీడీపీ తీరు మార్చుకోకపోవడం విడ్డూరమే.
Also Read : టీడీపీ ఇక ఆంధ్రా పార్టీయే?