iDreamPost
iDreamPost
చాలా కాలంగా వెయిటింగ్ లో ఉన్న శర్వానంద్ ‘శ్రీకారం’ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని మార్చ్ 11 లాక్ చేసుకోవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఓటిటి పుకార్లకు చెక్ పెడుతూ అఫీషియల్ గా ఈ విషయం ప్రకటించడంతో రిలీఫ్ ఫీలయ్యారు. మహా శివరాత్రిని టార్గెట్ చేసుకుని చాలా తెలివైన ఎత్తుగడ వేసిన శ్రీకారంకు అదే రోజు పోటీ లేదనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. తనతో పాటు మరికొన్ని సినిమాలు కూడా పండగని లక్ష్యంగా చేసుకుని మరీ తమ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటున్నాయి. మార్చి నాలుగో వారం నుంచి బాక్సాఫీస్ పోటీ ఇంకా తీవ్రంగా ఉంటుంది కాబట్టి రిస్క్ అనుకున్నవి అంతకన్నా ముందే వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
అందులో మొదటిది మంచు విష్ణు ‘మోసగాళ్లు’. కాజల్ అగర్వాల్ తనకు చెల్లిగా నటించడం ఇప్పటికే ఆసక్తి రేపుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో ఇంగ్లీష్ తో సహా మల్టీ లాంగ్వేజ్ లో విడుదల కాబోతున్న ఈ మూవీకి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. బడ్జెట్ పరంగా విష్ణు కెరీర్ లో ఇప్పటిదాకా దేనికీ పెట్టనంత మొత్తాన్ని దీనికి ఖర్చు పెట్టారు. అన్ని భాషల్లో రిలీజ్ చేయాలి కాబట్టి మార్చ్ 11ని అనుకూలమైన డేట్ గా భావిస్తున్నారట. అఫీషియల్ గా మరికొద్ది రోజుల్లో చెప్పే అవకాశం ఉంది. మనీ క్రైమ్ ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ బిగ్గెస్ట్ ఐటి క్రైమ్ అని పెట్టిన ట్యాగ్ అంచనాలు రేపుతోంది.
ఇక రెండోది మహానటి దర్శకుడు నాగ అశ్విన్ నిర్మాతగా మారి అనుదీప్ దర్శకత్వంలో తీసిన ‘జాతిరత్నాలు’. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో సూపర్ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇతర ముఖ్యమైన క్యారెక్టర్లతో చాలా డిఫరెంట్ గా దీన్ని తీర్చిదిద్దారట. ఆ మధ్య వచ్చిన ఓ చిన్న టీజర్ యూత్ ని బాగానే ఆకట్టుకుంది. ముందు ఎలాంటి హైప్ లేనట్టు కనిపించినా ఆ తర్వాత బజ్ తెచ్చుకోవడంలో ఇలాంటి సినిమాలు గతంలో అద్భుతాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. శ్రీవిష్ణు ‘గాలి సంపత్’ కూడా రేస్ లోకి వచ్చింది. అనిష్ దర్శకత్వంలో అనిల్ రావిపూడి దీనికి కథ స్క్రీన్ ప్లే అందించారు. మొత్తానికి శ్రీకారం సోలోగా రావడం లేదన్నది మాత్రం కన్ఫర్మ్.