Idream media
Idream media
అమరావతిలో జరిగిన భూముల ఇన్సైడర్ ట్రేడింగ్ దందాపై విచారణ వ్యవహారం తుది దశకు చేరుకుంది. భూ అక్రమాలపై విచారణ సిట్, సీఐడీ. ఏసీబీలు చేస్తున్న విచారణపై ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలంటూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ రోజు మరోసారి ఇరు వైపుల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
అమరావతిలో భూ అక్రమాలను నిగ్గుతేల్చాలనే లక్ష్యంతో ఉన్న ఏపీ సర్కార్.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. రాజధాని ప్రకటనకు ముందే వేలాది ఎకరాలు చేతులు మారాయనే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, వాస్తవాలను నిగ్గుతేల్చి ప్రజల ముందు ఉంచాలనేదే తమ ఉద్దేశమని ఏపీ సర్కార్ ఆది నుంచి చెబుతోంది. దీనికి అనుగుణంగానే సుప్రీం కోర్టులోనూ తమ వాదనలను వినిపిస్తోంది. తాజాగా ఈ రోజు జరిగిన విచారణలో ఏపీ సర్కార్ వ్యవస్థల ద్వారా కక్ష సాధింపునకు పాల్పడుతోందంటూ అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు.
Also Read : నీళ్లలోనూ రెండు కళ్ల సిద్దాంతమేనా బాబూ..?
ఈ సమయలో కలుగజేసుకున్న ఏపీ సర్కార్ తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్.. నిజాలను నిగ్గు తేల్చడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. రిటైర్డ్ లేదా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని విన్నవించారు. సీబీఐతో విచారణ జరిపినా తమకు అభ్యంతరం లేదని, అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనానికి విన్నవించారు. ఏపీ సర్కార్ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది.
సుప్రీంలో ఏపీ సర్కార్ వాదనల తర్వాత.. టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. అమరావతిలో భూ అక్రమాలు జరిగాయనే విషయం అందరికీ అర్థమైంది. ఇక చట్ట ప్రకారం నిర్థారణ కావాల్సి ఉంది. దమ్ముంటే విచారణ జరిపాలని సవాళ్లు విసిరిన టీడీపీ నేతలు.. సిట్, సీఐడీ, ఏసీబీ విచారణలు ప్రారంభం కాగానే.. నిలిపివేయాలంటూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్ర ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో.. సామాన్య ప్రజలకు టీడీపీ నేతలు భూ దందా చేశారని అర్థమైంది.
ఏపీ హైకోర్టులో స్టే కోసం చేసిన వాదనలే సుప్రింలోనూ అభియోగాలు ఎదుర్కొంటున్న వారు చేస్తున్నారు. వారి వాదనలు తేలిపోయేలా… రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కాకుండా.. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ చేత విచారణ జరిపించాలని ఏపీ సర్కార్ కోరుతుండడం సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఆందోళన టీడీపీ నేతల్లో మొదలైంది.
Also Read : ఫైబర్ స్కామ్ – లోకేష్ ఇరుకున్నట్లేనా?