iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో చేస్తున్న కృషికి బ్యాంకులు తోడ్పాటును అందిస్తున్నాయి. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు పారిశ్రామిక రంగానికి రుణాల మంజూరును జోరుగా కొనసాగించాయి. దేశం మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగానికి రుణాల మంజూరు తిరోగమనంలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వృద్ధి నమోదైంది.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మూడేళ్లుగా అంటే 2019 నుంచి 2021 మార్చి వరకు బ్యాంకు రుణాల మంజూరు పెరిగింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఏటేటా తగ్గుతూ వస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో సైతం 2019 నుంచి 2021 మార్చి వరకు ఏటేటా రుణాల మంజూరు తగ్గింది. వివిధ రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగానికి షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుల రుణాల మంజూరు తీరుపై ఆర్బీఐ ఇటీవల విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. 2020 మార్చి నుంచి 2021 మార్చి నాటికి ఉన్న పరిస్థితిని పోల్చి చూస్తే దేశ వ్యాప్తంగా పారిశ్రామిక రంగానికి బ్యాంకు రుణాల మంజూరు 3.9 శాతం తిరోగమనంలో ఉంది.
సర్కారు ముందుచూపుతో..
దక్షిణాది రాష్ట్రాల్లో కూడా 0.43 శాతం క్షీణత నమోదైంది. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం 5.3 శాతం వృద్ధి నమోదైంది. ఇందుకు ప్రధాన కారణం కోవిడ్ సంక్షోభంలో కూడా జాగ్రత్తలతో పరిశ్రమలు పని చేయడానికి అనుమతించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా పారిశ్రామిక రాయితీలను విడుదల చేయడమే. ప్రధానంగా ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి బ్యాంకుల ద్వారా పారిశ్రామిక రంగానికి రుణాలు మంజూరు చేసే వాతావరణాన్ని కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్ఎంఈలకు రూ.44,500 కోట్ల మేర బ్యాంకు రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఆరు నెలల్లోనే అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.24,896 కోట్ల (55.95 శాతం) రుణాలు మంజూరయ్యాయి.
సీఎం చొరవకు ప్రశంసలు..
పారిశ్రామికవేత్తలకు అవసరమైన రాయితీలు, కావలసిన సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. పరిశ్రమలకు బ్యాంకులు రుణాలు విరివిగా మంజూరు చేసే వాతావరణం కల్పిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సరికొత్త బాటలు పడుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చొరవను అటు పారిశ్రామికవేత్తలు, ఇటు బ్యాంకర్లు కూడా ప్రశంసిస్తుండడం గమనార్హం.
Also Read : రేపటి వెలుగుల కోసం