iDreamPost
android-app
ios-app

ఆవ భూముల మీద అభ్యంతరాలు పెడుతున్న టీడీపీ, దీనికి సమాధానం ఏం చెబుతుందో

  • Published Sep 19, 2020 | 5:14 AM Updated Updated Sep 19, 2020 | 5:14 AM
ఆవ భూముల మీద అభ్యంతరాలు పెడుతున్న టీడీపీ, దీనికి సమాధానం ఏం చెబుతుందో

గతంలో ఏ ప్రభుత్వం చేయని బృహత్తర ప్రయత్నం జగన్ సర్కారు చేస్తోంది. రాష్ట్రంలో ఇంటి సదుపాయం లేని పేదలు ఉండకూడదనే సంకల్పంతో సాగుతోంది. ఏకకాలంలో 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దానికి అనుగుణంగా భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటికే అనేక చోట్ల భూసేకరణ చేసింది. లే అవుట్ చేసి ఇళ్ల స్థలాల పంపిణీకి అంతా సిద్దం చేసిన వేళ విపక్షం అడ్డుపుల్లలు వేసే ప్రయత్నం చేస్తోంది. పెద్దలకు కారుచౌకగా ఇళ్ల స్థలాల పేరుతో భారీ నజనారాలు సమర్పించిన చంద్రబాబు ఇప్పుడు పేదలకు సెంటు స్థలం ఇచ్చేందుకు అడ్డంకులు కల్పిస్తున్నారు. న్యాయస్థానాల ద్వారా రకరకాల వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి అడ్డంకులు సృష్టించేయత్నంలో ఉన్నారు. పేదలకు అమరావతిలో చోటు లేదన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు మీద పలువురు విమర్శలు చేస్తున్నారు. అందుకు తోడుగా రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో సేకరించిన ఆవ భూములపై కూడా అభ్యంతరాలు పెడుతున్నారు. వరదలు వస్తే మునిగిపోయే భూములను పేదలకు ఇస్తారా అంటూ టీడీపీ నేతలు, వారి అనుంగు మీడియా హంగామా చేస్తోంది. పేదల ఇళ్లను ముంచేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందా అంటూ సామాన్యుల మీద ప్రేమను ఒలకబోసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తోడుగా హైకోర్ట్ లో పిటీషన్లు కూడా వేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను వాయిదా వేసేందుకు కారకులయ్యారని టీడీపీ నేతలు విమర్శలు ఎదుర్కొంటున్నారు.

కేవలం విమర్శలు మాత్రమే కాకుండా అనేక చోట్ల టీడీపీ నేతల తీరు మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నంత కాలం పేదల గురించి పట్టించుకోకపోగా ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకు అడ్డంకులు పెడుతున్నారంటూ ఆందోళనలు కూడా సాగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిని పేదలు ముట్టడించారు. తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే టీడీపీ నేతలు ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ వారంతా మాజీ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. చంద్రబాబు తీరుని నిరసించారు.

జగన్ ప్రభుత్వం మునిగిపోయే భూములు పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తోందని విమర్శిస్తున్న చంద్రబాబు , ఆయన అనుచరులు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న దానికి సమాధానం ఏం చెబుతారన్నది చూడాలి. ఈ ఇళ్లు చంద్రబాబు హయంలో 2017లో ప్రారంభించారు. సగం పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. వాటిని సిద్ధం చేసి ప్రజలకు అందించాలని జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈలోగా వరదలతో ఇళ్లన్నీ జలమయమయ్యాయి. మొల లోతు నీటిలో నానుతున్నాయి. ఆ ఇళ్లకు వెళ్లే దారి లేక జనం సతమతం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది తూర్పు గోదావరిజిల్లా సామార్లకోటలోని చిత్రం. ఇళ్ల స్థలాల కేటాయించేందుకు ముందగా ఆ ప్రాంతాలను చదును చేసి, లే అవుట్ చేసే, ఎత్తు పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్న చంద్రబాబు, తన హయంలో ఇలా వరద నీటిలో ఇళ్లు నిర్మించిన తీరుకి సమాధానం చెప్పాలి కదా ..