iDreamPost
android-app
ios-app

పులిచింతల గేటు సమస్య, కృష్ణా నదిలో వరద బెడద

  • Published Aug 05, 2021 | 5:21 AM Updated Updated Aug 05, 2021 | 5:21 AM
పులిచింతల గేటు సమస్య, కృష్ణా నదిలో వరద బెడద

కృష్ణానది వరద ఉధృతి తో పులిచింతల ప్రాజెక్టు లో సమస్య వచ్చింది. ప్రాజెక్టుకి సంబంధించిన స్పిల్ వే లోని 16వ గేట్ సాంకేతిక సమస్యతో తొలగిపోయింది. దాంతో ప్రత్యామ్నాయం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. 16వ గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమయ్యారు. అయితే ప్రస్తుతం ఓ గేటు పూర్తిగా లేకుండా పోయిన నేపథ్యంలో డ్యామ్ నుంచి భారీగా నదీ జలాలు దిగువకు తరలిపోతున్నాయి. దాని మూలంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిమట్టం పెరుగుతోంది.

పులిచింతల ప్రాజెక్టు ప్రారంభించి పూర్తిగా పదేళ్లు నిండలేదు. కానీ ప్రస్తుతం అనూహ్యంగా గేటు ఊడిపోవడం విశేషంగా మారింది. ఎగువన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఇంతకన్నా పెద్ద వరదల సమయంలో కూడా పనిచేసినప్పటికీ పులిచింతల వద్ద మాత్రం దానికి భిన్నంగా పరిస్థితి ఏర్పడడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా స్టాప్ లాక్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ డ్యామ్ లో ఉన్న నదీ జలాలు దిగువకు తరలిపోవడం, అవన్నీ వృధాగా సముద్రం పాలుకావాల్సిన పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా మారింది. దాంతో పాటుగా ఆ గేటు సమస్య మూలంగా నీటిమట్టం తగ్గించక తప్పని స్థితి ఏర్పడింది. డ్యామ్ భద్రత రీత్యా అన్ని గేట్ల నుంచి నీటిని దిగువకు వదిలేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.

ఇప్పటికే కృష్ణా నదీ ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. తుంగభద్ర, ఆల్మట్టి సహా అన్ని ప్రాజెక్టుల నుంచి దిగువ ప్రాజెక్టుల వరకూ ఇన్ ఫ్లోస్ తగ్గిపోయాయి. శ్రీశైలం వద్ద కూడా ఓ సందర్భంలో 10గేట్లు ఎత్తి నీటిని వదిలితే ప్రస్తుతం దాదాపు గేట్లన్నీ దించేసే స్థితి వచ్చింది. నాగార్జున సాగర్ వద్ద కూడా అదే పరిస్థితి. ఆగష్టు మొదటి వారం గడిచిపోతున్న తరుణంలో రాబోయే నెలరోజుల్లో వాతావరణ పరిస్థితులు సహకరించకపోతే నీటి నిల్వలపై ఆధారపడాల్సి ఉంటుంది. అలాంటి స్థితి ఉన్న సమయంలో ఇప్పుడు పులిచింతల వద్ద ఏర్పడిన సమస్య తీవ్రమైనదిగానే భావించాలి. ఎగువ నుంచి మళ్లీ నీరు వస్తే తప్ప లేదంటే ఈ సీజన్ లో పులిచింతల ఆధారిత డెల్టా వాసులకు కొన్ని సమస్యలు అనివవార్యం అవుతాయి

ఇక పులిచింతల వద్ద గేట్ తొలగిపోయిన తరుణంలో వస్తున్న వరద జలాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద అవుట్ ఫ్లో మళ్లీ పెరిగింది. రెండు రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తున్న తరుణంలో ప్రస్తుతం మళ్లీ పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభావంగా దిగువన కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో వరద ప్రమాదం ఏర్పడింది. లంక వాసులంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. వరదల సమయంలో నదీ ప్రవాహంలో దాటేందుకు ప్రయత్నించవద్దని సూచిస్తోంది.