ఒంగోలు జిల్లా చట్టం -1970 కింద 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేశారు.అనంతరం 1972 ఫిబ్రవరి 2న ఒంగోలు జిల్లా పేరు ప్రకాశం జిల్లాగా మారింది.కర్నూలు జిల్లా నుండి గిద్దలూరు, మార్కాపురం,ఎర్రగొండపాలెం తాలూకాలు నెల్లూరు జిల్లా నుంచి కనిగిరి,కందుకూరు,దర్శి పొదిలి తాలూకాలు,గుంటూరు జిల్లాలోని అద్దంకి, చీరాల,ఒంగోలు తాలూకాలు కలిపి ఒంగోలు జిల్లాగా ఏర్పడింది.అనంతరం జిల్లాకు చెందిన మహనీయుడు ఉమ్మడి మద్రాసులో ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులు గారి మరణాంతరం వారి పేరును ఒంగోలు జిల్లాకు పెట్టడం జరిగింది.దీంతో1972 ఫిబ్రవరి 2న నుండి ఒంగోలు జిల్లా పేరు ప్రకాశం జిల్లాగా మారింది.
102 కిలో మీటర్ల విశాలమైన సముద్ర తీరంతో పాటు నల్లమల అడవులు జిల్లాకు అదనపు ఆకర్షణ. lగుండ్లకమ్మ,ముసి,పాలేరు నదులతో పాటు తమ్మిలేరు,గుడిసెలేరు,ఓగేరు,నల్ల వాగు,వేదిమంగళ వాగులు ఉన్నా ఎందుకో సాగర్ కాలువ తవ్వే వరకు ప్రకాశం జిల్లాకు నీటి కరవు ఉండేది.గుండ్లకమ్మ నది నల్లమలలో గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద ప్రారంభమవుతుంది.265 కిలో మీటర్ల నది పరివాహక ప్రాంతంలో సుమారు 220 కిలోమీటర్లు జిల్లాలో ప్రవహిస్తుంది.ఒక్క గుండ్లకమ్మ మీద చాలా ప్రాజెక్టులు ఉన్నాయి.5 లక్లల ఎకరాలు మేజరు,6 లక్షల ఎకరాలు మైనరు ఇరిగేషన్ కింద సాగు చేస్తున్నారు.ఇప్పటికీ లక్ష ఎకరాలు సుమారు 957 చెరువుల కింద సాగవుతున్నాయి.
జిల్లాలో ఒక్క ఒంగోలు తప్ప మిగిలిన జిల్లా అంతా వెనకపడినప్రాంతమే.కలకత్తా, చెన్నై జాతీయ రహదారి-జిటి రోడ్, చైన్నై-కలకత్తా ప్రధాన రైలు మార్గం ఉండటంతో జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఏదో ఒంగోలైనా అలా ఉంది కానీ లేక పోతే ఒంగోల ను ప్రకాశం జిల్లాను పట్టించుకునేవారేరి అని అనిపించడం తప్పు కాదు.రాజకీయ పరంగా రాయలసీమ వారితో కలసి ఉన్నట్లు ఉన్నా గుంటూరు జిల్లా పోకడలు కనిపిస్తాయి.ఎప్పుడు దిగుమతి కాబడిన నాయకులు ఒంగోలు పార్లమెంటు పరిధి నిర్లక్ష్యానికి కారణమని అనుకుంటారు.మాగుంట మరణం కూడా జిల్లాకు పెద్ద లోటుగా భావిస్తారు.
2009 తెలంగాణ ఉద్యమం తార స్థాయిలో ఉన్నప్పటి నుంచి దొనకొండ -ఒంగోలు రాజధాని అని మారుమోగినా 2014 లో అమరావతి రాజధాని ప్రకటనతో జిల్లా వాసులలో నైరాశ్యం ఏర్పడింది.జిల్లాకు తీరని కల రామాయ పట్నం పోర్టు,ఎప్పటి నుంచో పెండింగు లో ఉన్న వెలిగొండ,ఇటీవల ఆశ కలిగిన దొనకొండ పారిశ్రామిక వాడ నిర్మాణం జరిగితే కాని జిల్లా అభివృద్ధి చెందిందని అనిపించుకోదు.ఒకవేళ నూతన ముఖ్యమంత్రి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే జిల్లా రూపు రేఖలు వచ్చే ఏడాది ఆవిర్భావ దినోత్సవానికి మారవచ్చు.
చివరిగా
పేరు లోనే ప్రకాశం
అభివృద్ధి కోసం చూస్తున్నాం ఆకాశం
నాయకులకు లేదు సిగ్గు ఏకోశం
మనకు లేదా ఆక్రోశం
ఎదురు చూస్తున్నాం ఒక అవకాశం
………………….
రాజధాని అన్నారు రాళ్ళ పాలుగ ఉన్నాము
సాగుకు నీరు లేదు త్రాగుకు గుక్క లేదు
శంకుస్థాపనలు కనులకు ఇంపుగా
మాటలు చెవులకు సొంపుగా
మారాయి పార్టీలు నాయకులు వారే
మాది జిల్లానే ..మేము మనుషులమే…