iDreamPost
android-app
ios-app

పరిషత్ ఎన్నికలు – పోలింగ్ కు ముందే వంద మంది అభ్యర్థులు మృతి!

పరిషత్ ఎన్నికలు – పోలింగ్ కు ముందే వంద మంది అభ్యర్థులు మృతి!

రాష్ట్రంలో గత ఏడాది మొదలైన స్థానిక పరిషత్ ఎన్నికలు మధ్యలోనే ఆగిపోయాయి. అప్పట్లో ఎన్నికల షెడ్యూల్ ను అనుసరించి నామినేషన్ వేసి, ప్రచారం కూడా చివరి దశకు చేరుకున్న దశలో ఎన్నికల క్రతువు ఆగిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇటీవల గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తయినా పరిషత్ ఎన్నికలు మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దీని మీద ఇంకా స్పష్టత లేదు. అయితే ఆ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో పోటీలో ఉన్న వారు పోలింగ్‌కు ముందే 100 మంది మృతి చెందారు అన్నది అధికారిక సమాచారం.

జెడ్పీటీసీ అభ్యర్థులు 13 మంది, ఎంపీటీసీ అభ్యర్థులు 87 మంది కన్నుమూత

ఏడాది క్రితం మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఏ పార్టీలు తరఫున ఎంత మంది మృతి చెందారు అన్న దాని మీద లెక్కలు బయటకు వచ్చాయి.

మృతుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 61 మంది, టీడీపీ అభ్యర్థులు 34 మంది ఉన్నారు. స్వతంత్రులు కలిపి 5 మంది ఉన్నారు. పార్టీ అభ్యర్థులు చనిపోయిన చోట మరో అభ్యర్థిని నిలిపేందుకు అవకాశం ఉంది. మునిసిపల్‌ ఎన్నికల్లో సైతం ఎస్‌ఈసీ ఈ మేరకు వీలు కల్పించింది.ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సరిగ్గా వంద మంది పోలింగ్‌ జరగడానికి ముందే చనిపోయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్‌ శాఖల పరిశీలనలో వెల్లడైంది.

మృతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు సైతం కొందరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది మార్చి నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్పట్లో పోటీలో ఉన్న అభ్యర్థుల స్థితిగతులపై అధికారులు వాకబు చేసినట్టు తెలిసింది. 2020 మార్చి 15న ఎన్నికలు వాయిదా పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 87 మంది, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 13 మంది చనిపోయారని నిర్ధారించారు.

మృతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 8 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. చనిపోయిన వారిలో 98 మంది సాధారణ అనారోగ్యం, ఇతర కారణాల వల్ల చనిపోతే రెండు అనుమానాస్పద మృతి వున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అందులో 9,692 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అందులో 2,371 స్థానాలుఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,321 స్థానాల్లో పోటీ జరుగుతుండగా, 19,000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన 2371 మందిలో చిత్తూరులో ఐదుగురు.. విజయనగరం, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరి చొప్పున 8 మంది చనిపోయారు.

ఎన్నికలు జరగాల్సి ఉన్న మిగిలిన 7,321 ఎంపీటీసీ స్థానాల్లో పోటీలో ఉన్న 19 వేల మందిలో 79 మంది చనిపోగా, వీరిలో అత్యధికులు వివిధ రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉన్న వారే కావడం గమనార్హం. ఐదుగురు మాత్రమే స్వతంత్ర అభ్యర్థులు.

రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను అప్పట్లో 8 చోట్ల ఎన్నికలు వాయిదా పడగా, మిగిలిన 652 చోట్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. అందులో 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో ఏకగ్రీవంగా గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఒకరు మృతి చెందారు. ఏకగ్రీవంగా ముగిసినవి పోను 526 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, 2,092 మంది పోటీలో ఉన్నారు. వీరిలో చనిపోయిన 12 మందిలో (ఏకగ్రీవమై చనిపోయిన వ్యక్తి కాకుండా) 11 మంది వివిధ రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉన్న వారు.

ఆ స్థానాల్లో మళ్లీ నామినేషన్‌కు వీలు!

అభ్యర్థులు చనిపోయిన చోట తిరిగి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభించేందుకు ఎస్‌ఈసీ అవకాశం ఇచ్చే వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాజకీయ పార్టీలకు మాత్రమే ఆయా చోట్ల కొత్త అభ్యర్థులను బరిలో నిలిపేందుకు అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ సంప్రదాయం అమలు చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు చనిపోయిన చోట మాత్రం ఈ అవకాశం ఉండదని చెబుతున్నారు. అయితే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు చనిపోతే ఎలా వ్యవహరించాలన్న దానిపై తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఎస్‌ఈసీ వర్గాలు తెలిపాయి.