హుజూర్నగర్ ఉప ఎన్నిక అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఊడిపోతుందని టీఆర్ఎస్ హుజూర్నగర్ ఉప ఎన్నికల ఇంచార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి జోస్యం చెప్పారు. రేవంత్, కోమటిరెడ్డి పీసీసీ పదవి కోసం రోడ్ల మీద పడి కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. హుజూర్నగర్లోని పార్టీ కార్యాలయంలో శనివారం రాజేశ్వర్రెడ్డి మీడియా తో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ గడప గడపకు తిరిగి ఓట్లడిగామన్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి హుజూర్నగర్ ప్రజలను రెచ్చగొట్టేలా, అవమానించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుడైన సైదిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని హుజూర్నగర్ ప్రజలంతా కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.