iDreamPost
android-app
ios-app

దేశ వ్యాప్తంగా పలు హైకోర్టుల్లో బదిలీలు

దేశ వ్యాప్తంగా పలు హైకోర్టుల్లో బదిలీలు

దేశ వ్యాప్తంగా పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ, పలువురు జడ్జిలకు పదోన్నతులు కల్పిస్తూ సుప్రిం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14వ తేదీన జరిగిన ఐదుగురు న్యాయమూర్తుల సుప్రిం కోర్టు కొలీజియం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. కొలీజియం తీసుకున్న నిర్ణయాలను ఈ రోజు సుప్రిం కోర్టు వెల్లడించింది. ఏపీ హైకోర్టు సీజే జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు… ఆ అక్కడ సీజేను ఏపీకి బదిలీ చేసింది. మొత్తం నలుగురు ప్రధాన న్యాయమూర్తులను ఐదుగురు న్యాయమూర్తులను బదిలీ చేసిన సుప్రిం కోర్టు.. ఐదుగురు న్యాయమూర్తులకు పదోన్నతులను కల్పించింది.

బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తులు..

– ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ అయ్యారు.

– సిక్కిం హైకోర్టు సీజే జస్టిస్‌ ఎ.కె.గోస్వామి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ

– ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మొహమ్మద్‌ రఫీక్‌ మధ్యప్రదేశ్‌కు బదిలీ అయ్యారు.

– తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ ఉత్తరాఖండ్‌కు బదిలీ అయ్యారు.

బదిలీ అయిన న్యాయమూర్తులు..

– మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌ కొఠారి గుజరాత్‌కు బదిలీ అయ్యారు.

– మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరు కర్ణాటకకు, మరొకరు అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

– జమ్మూకశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాజేష్‌ బిందాల్‌ కోల్‌కతాకు బదిలీ అయ్యారు.

– కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయ్యారు.

పదోన్నతులు పొందిన వారు వీరే..

– పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మురళీధర్‌ను ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై పంపారు.

– ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీకి తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించారు.

– కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీబ్‌ బెనర్జీకి మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి ఇచ్చారు.

– అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ జమ్ము కశ్మీర్‌ ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

– ఉత్తరాఖండ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుధాంశు ధులియాను గుహవటి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై పంపారు.