మాజీ మంత్రి, టిఆర్ఎస్ దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల న్యుమోనియా కారణంగా నాయిని నర్సింహారెడ్డి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాగా ఆయన మృతి అనంతరం ఐదు రోజుల వ్యవధిలోనే నర్సింహారెడ్డి భార్య అహల్య(68) కన్నుమూశారు.
నాయిని నర్సింహారెడ్డితో పాటు ఆయన భార్యకు కూడా కరోనా వైరస్ సోకింది.ఇద్దరూ కరోనా నుండి కోలుకున్నారు కూడా. కాగా కరోనా తగ్గిన తరవాత నాయిని నర్సింహారెడ్డికి న్యుమోనియా సోకిన కారణంగా మరణించారు. భర్త నాయిని నర్సింహరెడ్డి మృతి చెందినపుడు ఆఖరి చూపుకు అహల్యను కుటుంబ సభ్యులు అంబులెన్స్లో తీసుకొచ్చారు. కాగా అహల్య ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురికావడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆవిడ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఐదు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతిచెందడంతో నాయిని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.