iDreamPost
android-app
ios-app

నా మెంటార్ నా సమస్యకు పరిష్కారం చెప్పటం లేదు : రిషబ్ పంత్

నా  మెంటార్ నా సమస్యకు పరిష్కారం చెప్పటం లేదు : రిషబ్ పంత్

భారత జట్టులో ధోనీ స్థానంలో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వైఫల్యం చెంది విమర్శలు ఎదుర్కొంటున్న భారత వికెట్‌కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ రిష‌భ్ పంత్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్వ‌హించిన సోష‌ల్ మీడియా సెష‌న్‌లో పాల్గొన్న పంత్ మహేందర్ సింగ్ ధోని నాకు మార్గదర్శి అని పేర్కొన్నాడు.ఇంకా నాకు మంచి బ్యాటింగ్ పార్ట్‌నర్ కూడా ధోనీనే అని రిషబ్ పంత్ తెలిపాడు. మహీభాయ్‌ క్రీజులో ఉంటే మనం ఆలోచించాల్సిన పని ఉండదు.అత‌ని ప్రణాళిక‌ల‌కు అనుగుణంగా బ్యాటింగ్ చేస్తే స‌రిపోతుంద‌ని అతను వ్యాఖ్యానించాడు.

భారత మాజీ సారథి ఎంఎస్ ధోని గురించి పంత్ మాట్లాడుతూ ‘‘ధోనీ నాకు మెంటార్‌లా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే నేను ఆయన వద్దకు వెళ్తాను. కానీ ధోనీ ఆ సమస్యకు పూర్తి పరిష్కారం చెప్పడు. కొన్ని చిట్కాలు మాత్రమే చెప్పేవాడు.ఇంకా ధోనీ నాకు గ్రౌండ్‌లోనే కాదు, బ‌య‌ట కూడా చాలాసార్లు సాయం చేశాడు.అయితే ధోనీ కేవలం సమస్య పరిష్కార మార్గం మాత్రమే చూపుతాడు.అందుకే నేను అతని సలహాల కోసం ఎక్కువగా ఆధారపడను” అని చెప్పాడు.

ఐపీఎల్ 2018 సీజ‌న్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన పంత్‌ ఐపీఎల్‌లో ఢిల్లీ త‌ర‌పున ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు( 684 ) చేసిన క్రికెట‌ర్‌గా ఘనత వహించాడు.గ‌తేడాది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుని మూడో స్థానం సాధించడంలో పంత్‌ కీలక పాత్ర పోషించాడు.ఇటీవ‌ల న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో పంత్ వికెట్‌కీప‌ర్‌గా జట్టులో స్థానం సంపాదించిన ప్పటికీ రాణించలేదు. మ‌రోవైపు ప్ర‌స్తుతం పంత్ టెస్టుల‌కే పరిమిత‌మ‌య్యాడు. గ‌త జ‌న‌వ‌రి నుంచి లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్‌లలో తుది జ‌ట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే.అత‌ని స్థానాన్ని కేఎల్ రాహుల్ ఆక్రమించాడు.కేఎల్ రాహుల్‌ లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కివీస్ గడ్డపై వన్డే టీ20 సిరీస్‌లలో అద్భుతంగా రాణించాడు. గత కొంతకాలంగా రిషబ్ పంత్ స్థానములో రాహుల్‌కి మూడు ఫార్మాట్లలోనూ జట్టులో స్థానం కల్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.