iDreamPost
android-app
ios-app

Meghalaya – మేఘాలయలో కాంగ్రెస్ కు షాక్ -మాజీ సీఎం సహా 12 మంది ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరిక

  • Published Nov 25, 2021 | 6:17 AM Updated Updated Mar 11, 2022 | 10:33 PM
Meghalaya – మేఘాలయలో  కాంగ్రెస్ కు షాక్  -మాజీ సీఎం సహా 12 మంది ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరిక

పూర్వ వైభవం సాధించడానికి కాంగ్రెస్ ఎంత ప్రయత్నిస్తుంటే.. అంతగా దెబ్బతింటోంది. తాజాగా ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా సహా 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెసుకు రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెసులో చేరారు. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఉనికే లేని టీఎంసీ రాత్రికి రాత్రే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 2018 ఎన్నికల్లో 60 సీట్లున్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ 21 స్థానాలు సాధించింది. ఇప్పుడు ఏకంగా 12 మంది పార్టీ ఫిరాయించారు. ఆ మేరకు అసెంబ్లీ స్పీకరుకు లేఖ రాశారు.

కాంగ్రెసే టార్గెట్

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు పశ్చిమ బెంగాల్ కే పరిమితమైన టీఎంసీని జాతీయస్థాయిలో ప్రధాని మోదీని, బీజేపీని ఢీకొనేందుకు వీలుగా ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించాలని పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జీ నిర్ణయించారు. ఇందుకు ఆమె ప్రధానంగా కాంగ్రెసునే టార్గెట్ చేస్తున్నారు. మొదట ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించారు. త్రిపుర, అసోంలలో పలువురు కాంగ్రెస్ నేతలను పార్టీలోకి చేర్చుకున్నారు. తాజాగా మేఘాలయాలో కాంగ్రెసుకు షాకిచ్చారు. మరోవైపు గోవాలోనూ మాజీ సీఎం లూజినో ఫెలీరో, మరికొందరు కాంగ్రెసు నేతలను పార్టీలోకి తీసుకుని అక్కడ వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. కాగా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మమతా సమక్షంలో కాంగ్రెసుకు చెందిన మాజీ ఎంపీ కీర్తి ఆజాద్, ఒకప్పటి రాహుల్ సన్నిహితుడు అశోక్ తన్వర్ టీఎంసీలో చేరారు.

మేఘాలయ కాంగ్రెసులో విభేదాలు

మేఘాలయ కాంగ్రెసులో కొన్నాళ్లుగా నెలకొన్న విభేదాలు తాజా పరిణామాలకు కారణం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విన్సెంట్ పాల్ తో మాజీ సీఎం ముకుల్ సంగ్మాకు విభేదాలు ఉన్నాయి. ఈ విషయమై చర్చించేందుకు సంగ్మా గత నెలలో రాహుల్ తో సమావేశం అయ్యారు. పాల్, సంగ్మా మధ్య రాజీ కుదిర్చేందుకు రాహుల్ ప్రయత్నించినా కుదరలేదు. అలాగే గత నెలలోనే సంగ్మా మమతా బెనర్జీతోనూ భేటీ అయ్యారు. తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం షిల్లాంగ్ వెళ్లి పావులు కదపడంతో సంగ్మా బృందం తృణమూల్లో చేరిపోయింది. కాగా తాజా పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఏఐసీసీ మేఘాలయ ఇంఛార్జి మనీష్ ఛత్రత్ ను ఉన్న ఫళంగా షిల్లాంగ్ వెళ్ళమని ఆదేశించింది.

Also Read : Up Congress – పోరాడుతున్నా ప్రయోజనం లేదు. యూపీలో కాంగ్రెస్‌ నామమాత్రమేనా?