Idream media
Idream media
మీడియా స్వేచ్ఛ అనే అంశంపై ఇప్పుడు ప్రపంచమంతా చర్చ నడుస్తోంది. కొన్ని పత్రికలని వైట్హౌస్లోకి అడుగు పెట్టనివ్వనని ట్రంప్ తీర్మానించాడు. చైనాలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. కాశ్మీర్లో వాస్తవ పరిస్థితులని రాసే వాతారణం లేదు.
సోషల్ మీడియాలో రాసినా కన్నెర్ర చేస్తున్నారు. గతంలో జగన్ డిజిటల్ మీడియాపై చంద్రబాబు కేసులు పెట్టించారు. ఈ మధ్య మమతా దీదీ తనకు వ్యతిరేకంగా పోస్టు పెట్టాడని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సన్మాయ్బంధోపాధ్యాయ్ని అరెస్ట్ చేయించడమే కాదు స్టేషన్లో చావబాదించింది. గతంలో మార్క్సిస్ట్ ప్రభుత్వంలో భావ ప్రకటనా స్వేచ్ఛ లేదని గొడవ చేసిన వ్యక్తి ఈవిడ.
వాస్తవానికి మీడియా రెండు రకాలుగా చీలి పోయింది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక మీడియా. ఇదే మీడియా ప్రభుత్వాలు మారితే పాలసీ మార్చుకుంటుంది. చంద్రబాబు ఉంటే అనుకూల మీడియాగా ఉన్న ఆంధ్రజ్యోతి జగన్ రాగానే వ్యతిరేకంగా మారుతుంది. సాక్షి కూడా అంతే.
ప్రజల కష్టాలు, సమస్యలు అన్న మనకు అనుకూలంగా లేని ప్రభుత్వం వచ్చినప్పుడు బయటికి వస్తాయి. లేదంటే లేదు. అదే విధంగా తమకు ఇష్టంలేని వార్తలని రాసే పత్రికలని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడాన్ని పాలకులు కూడా నేర్చుకున్నారు.
ఉద్యమంలో ఉన్నప్పుడు మీడియాని పొగిడిన కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే చుక్కలు చూపించారు. నమస్తేతెలంగాణ తప్ప మిగతా ఏదీ ఆయనకు నచ్చదు. జగన్ ఏకంగా ప్రెస్ బిల్లే తెచ్చాడు. మీడియా స్వేచ్ఛ కోరుకుంటుంది. పాలకులు సెన్సర్షిప్ కోరుకుంటారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇదే. అంటే పాక్షిక ఎమర్జెన్సీ అన్నమాట.
ఎమర్జెన్సీలో జర్నలిజంతో ఏమీ సంబంధం లేదని అధికారులు పత్రికల వార్తలని నిర్ణయించేవారు. దీనికి నిరసనగా ఎడిట్ పేజీని ఖాళీగా ముద్రించిన పత్రికలు ఉన్నాయి. బీబీసీ ఎడిటర్ మార్క్టుల్లోనిని లండన్ పంపేశారు.
ఎందుకంటే బీబీసీ విశ్వసనీయత ఎక్కువ. ఇందిరాగాంధీ హత్యని ఆకాశవాణి కంటే ముందు బీబీసీనే అనౌన్స్ చేసింది.
పత్రికలు అచ్చోసిన ఆంబోతుల్లా మీదపడతాయని పాలకుల ఆరోపణ. పొడవకపోతే ప్రభుత్వాలు దారికి రావని పత్రికల అభిప్రాయం. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి చూస్తుంటే పాలకులదే పైచేయి అయ్యేలా ఉంది.