మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ సంచలనం సృష్టించింది. ఔరంగాబాద్ నియోజకవర్గంలో భారీ విజయం దిశగా ఎంఐఎం సాగుతోంది. ఈ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 80శాతానికిపైగా ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి దక్కడం గమనార్హం. ఎన్నికల చరిత్రలోనే ఒక అభ్యర్థికి ఈస్థాయి ఓట్లు రావడం అనేది ఇదే తొలిసారి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఔరంగాబాద్ నియోజకవర్గంలో రికార్డుస్థాయి మెజారిటీతో సంచలన విజయం దిశగా ఎంఐఎం సాగుతోంది. మరో నియోజకవర్గంలోనూ ఎంఐఎం బొటాబొటి మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతోంది.
మహారాష్ట్ర లో గణనీయమైన స్థానాలు గెలుపొందనప్పటికీ.. మైనారిటీ ఓట్లను చీల్చడం ద్వారా పలు పార్టీల గెలుపోటములు శాసించగలిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ పార్టీ పోటీ వల్ల భారీ నష్టం జరిగింది. దాదాపు 44 స్థానాల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకే పడేవి. అటు హిందుత్వ కూటమిగా బీజేపీ-శివసేన కలిసి పోటీచేస్తున్న నేపథ్యంలో మైనారిటీలు సహజంగానే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపేవారు. అయితే, ఈసారి మస్లిజ్ పార్టీ పెద్ద ఎత్తున స్థానాల్లో పోటీచేసి.. గట్టిగా ప్రచారం చేయడంతో కాంగ్రెస్కు మైనస్గా మారింది. కాంగ్రెస్కు ఓటుబ్యాంకుగా ఉన్న మైనారిటీ ఓట్లు చీలడం.. బీజేపీ-శివసేన కూటమికి వరంగా మారింది. దీంతో కాంగ్రెస్కు పట్టున్న కొన్ని స్థానాల్లోనూ బీజేపీ కూటమి సునాయసంగా గెలువగలిగింది.