iDreamPost
android-app
ios-app

సీఎం జగన్ నిర్ణయం రైట్ – జయప్రకాష్ నారాయణ

  • Published Sep 10, 2020 | 6:20 AM Updated Updated Sep 10, 2020 | 6:20 AM
సీఎం జగన్ నిర్ణయం రైట్ – జయప్రకాష్ నారాయణ

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న పాలనాపరమైన నిర్ణయాలకు ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం , జనసేన, రాజకీయ పరంగా అడుగడుగునా తప్పుపడుతూ వస్తున్నా, పలువురు ప్రముఖుల నుండి మాత్రం మద్దతు లభిస్తుంది. ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన పధకాలకు పలు రంగాల ప్రముఖుల నుండీ ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. “జగన్ అన్న చేదోడు” పధకాన్ని ప్రముఖ హేర్ స్టైలిస్ట్ జవేద్ హబీబ్ ప్రశంశించగా, “నాడు నేడు” కార్యక్రమాన్ని డిల్లీ డిప్యుటీ సీయం మనీష్ సిసోడియా కొనియాడారు. అలాగే కరోనా నియంత్రణకు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు . ఇవే కాకుండా గ్రామ వాలంటీర్ల ఏర్పాటు, దిశా చట్టం, రివర్స్ టెండరింగ్ నిర్ణయాలు కూడా పలువురి అభినందనలు పొందాయి.

అయితే ముఖ్యమంత్రిగా జగన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలని తప్పు పడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షం పాలన సజావుగా సాగనీయకుండా కోర్టులని ఆశ్రయిస్తూ పదే పదే అడ్డుపడుతూ వచ్చింది. పాలనా వికేంద్రీకరణ నిర్ణయం దగ్గర నుండీ పేదలకు ఇళ్ళ పట్టాల నిర్ణయం వరకు కోర్టుల జోక్యంతో కొంత మేర ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం తీసుకున్న పాలనా పరమైన నిర్ణయాలలో కోర్టుల జోక్యం పట్ల చాలాకాలంగా వివాదాలు , వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి.

గతంలో ఎన్టీఅర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా పాలనా పరమైన నిర్ణయంలో కోర్టు జోక్యం పట్ల శాసన హక్కులను పరిరక్షించాల్సిందిగా భారత రాష్ట్రపతికి లేఖ రాస్తాను అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సందర్భంలో నాటి స్పీకర్ జి.నారాయణరావు మాట్లాడుతూ, రాజ్యాంగం రీత్యా శాసన సభకు అనేక అధికారాలు ఉన్నాయి అని, శాసన సభ అసహాయ స్థితిలో లేదు అని కనుక ఎవరినో ఆశ్రయించాల్సిన అవసరం ఎంతమాత్రము లేదని మనకు గల అధికారాలతోనే దీనిని పరిష్కరించుకోవచ్చని, రాజ్యంగంలో హైకోర్టు , శాసన సభలకు ఉన్న అధికారాలు గురించి , పరిధులు గురించి ఆర్టికల్ 211, 212 లో స్పష్టంగా నిర్వచించబడిందని అందులో శాసన సభకు తిరుగులేని అధికారాలు ఇచ్చారని , ఒకరి పరిధిలో మరొకరు జోక్యం చేసుకోవడం మంచిది కాదని కోర్టులకు తిరుగులేని అధికారాలు ఉన్నటే , శాసన సభకు కూడా తిరుగులేని అధికారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ఇదే నిర్ణయాన్ని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ సైతం గతంలోనే వెలిబుచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలలో కోర్టులు జోక్యం తప్పు అని. రాజధాని ఎక్కడ పెట్టాలనేది ప్రభుత్వ నిర్ణయమని, వికేంద్రీకరణని పూర్తిగా సమర్ధిస్తున్నానని ,ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న పాలనా వికేంద్రీకరణను పూర్తిగా సమర్ధిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. రాజధాని పేరిట రియల్ ఎస్టేటు తో భూమి రేట్లు పెంచి అదే అభివృద్దిగా చూపడం అంటే వాపుని బలుపుగా భ్రమింపచేయడమే అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ఇక తాజాగా ఒక చానల్ లో జరిగిన డిబేట్ లో మాట్లాడుతూ ఉచిత విద్యుత్ పై తెలుగుదేశం రైతులు నష్టపోతారు అంటూ చేస్తున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. విద్యుత్ రంగంలో జగన్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నదని, నాడు వైయస్ ఉచిత విద్యుత్ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా తాను రైతులకి ఉచితంగా ఇచ్చినా మీటర్ పెట్టమని చెప్పానని కొన్ని కారణాల వలన అది నాడు కార్యరూపం దాల్చలేదని , రైతులకి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తూనే మీటర్ పెడితే ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడ ఖర్చు అవుతుందో ఎంత వృదాగా పోతుంది అనేది అర్ధం అవుతుందని. అప్పుడే ఎనర్జీ ఆడిటింగ్ సరిగ్గా ఉంటుందని, అప్పుడే విద్యుత్ పొదుపు చేయవచ్చు అని ఈ పద్దతి అటు రైతులకి ఇటు ప్రభుత్వానికి మేలే జరుగుతుందని. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను అభినంధిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ఏది ఏమైనా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న పాలనా పరమైన నిర్ణయాల్లో ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం రాజకీయ ప్రయొజనాలకోసం అడుగడుగునా అడ్డు తగులుతున్నా, అవే నిర్ణయాలకు అంతకన్నా భారీ స్థాయిలో పలు వర్గాలనుండి సీఎం జగన్ కు మద్దతు రావడం హర్షించదగ్గ విషయం..