Idream media
Idream media
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో బాధ్యులు ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు చేపడతామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మాటను నిలబెట్టుకున్నారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ రోజు 12 మందిని అరెస్ట్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు సహా మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు.
విశాఖ సమీపంలోని ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్లో మే 7వ తేదీ తెల్లవారు జామున ప్రమాదకరమైన సై్టరిన్ గ్యాస్ విడుదలైంది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోగా దాదాపు 585 మంది ఆస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించింది. పరిహారం అందించింది. తిరిగి ఆ గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన తిరిగి పూర్వ స్థితి తీసుకువచ్చింది.
ఘటన జరిగిన రోజునే విశాఖకు వెళ్లిన సీఎం జగన్ బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకున్నారు. కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
శనివారం హైపవర్ కమిటీ సీఎంకు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై నివేదిక అందించింది. ప్రమాదం జరిగేందుకు యాజమాన్ల నిర్లక్ష్యం, సరైన నిర్వహణ లేకపోవడమే కారణమని పేర్కొంది. ఈ నేపథ్యంలో కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కంపెనీ సీఈవో సహా డైరెక్టర్లను అరెస్ట్ చేయడం ప్రభుత్వం చిత్తశుద్ధికి తార్కాణంగా నిలుస్తోంది. బాధితులకు పరిహారం, పునరావాస చర్యలు, తాజాగా బాధ్యులపై చర్యలు విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా వ్యవహరించడం గమనార్హం.