Idream media
Idream media
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. నవంబర్ లోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికలు ఒకటి రెండు నెలలు ముందే రావచ్చని.. అందరూ సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శ్రేణులకు సూచించారు. దీంతో ఎన్నికల నగారా ముందే మోగనుందని స్పష్టం అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలలోనూ టీఆర్ ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా సాగాలని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రేటర్ లో పాగా వేయడమే లక్ష్యంగా కేటీఆర్ ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నట్లు ఈ సమావేశంలో ఆయన మాట్లాడిన తీరుతో అర్థమవుతోంది.
ఆ కార్పొరేటర్లపై కేటీఆర్ ఫైర్
ఈ సమావేశంలో కొంత మంది సిట్టింగ్ కార్పొరేటర్ల పని తీరుపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్లో 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని.. పని తీరు మార్చుకోవాలని ఆయన ఒకింత హెచ్చరించారు. సమస్యలుంటే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
రూ.లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్కు రప్పించిన ప్రభుత్వం టీఆర్ఎస్ అని ఆయన చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో జీహెచ్ఎంసీలో వివిధ కార్యక్రమాలు చేపట్టామని.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి కార్పొరేటర్లు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో మాత్రమే కోతలు విధించామని.. ఇతర రాష్ట్రలకు చీరలను సప్లై చేసే స్థాయికి మన నేతన్నలు ఎదగడం గర్వకారణమన్నారు. మహిళా సంఘాల ద్వారా అక్టోబర్ 9 నుంచి చీరల పంపిణీ చేస్తామన్నారు. చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.