iDreamPost
iDreamPost
అసలే ఇంటిగుట్టు తెలిసిన నాయకుడు. సొంత బలాన్ని నమ్ముకుని ,టీడీపీ నేతలు కుట్రలు దాటి ఎదిగారు. టీడీపీకి బలమైన స్థానం అయినప్పటికీ తన ఇమేజ్ తో దానిని అధిగమించి సాగుతున్నారు. దాంతో కొడాలి నాని వ్యవహారం టీడీపీకి మింగుడుపడడం లేదు. అందుకు తోడు ఒకసారి మీడియా ముందుకు వస్తే కొడాలి నాని కొడవలి కోత మాదిరిగా మాట్లాడుతారని అంతా భావిస్తున్నారు. టీడీపీని వీడుతూ చంద్రబాబునుద్దేశించి చేసిన వ్యాఖ్యల నుంచి తాజాగా దేవినేని ఉమాపై చేసిన వ్యాఖ్యల వరకూ ఈ గుడివాడ నేతది అదే ధోరణి. అప్పట్లో తొలిసారి ఎమ్మెల్యే అయినా, ప్రస్తుతం ఏపీ మంత్రిగానయినా ఆయన తీరు మారలేదు. నోటికి పనిచెప్పాల్సి వస్తే ఎక్కడికైనా వెళతారని మరోసారి స్పష్టం చేశారు.
ఇప్పుడు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీరు చంద్రబాబుకి కంట్లో నలుసులా మారింది. ఆయన మీద విమర్శలు చేయలేరు..అలా అని మౌనంగా ఉండలేరు అన్నట్టుగా మారింది. సోషల్ మీడియా సాయంతో దుమ్మెత్తిపోసేందుకు టీడీపీ నిర్ణయం తీసుకుంది. విద్యార్థి విభాగం, ఇతర సోషల్ మీడియా కార్యకర్తలతో కొడాలి నానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ వాటికి సమాధానంగా నేరుగా నాని మీడియా ముందుకు వచ్చేస్తుండడం టీడీపీ సతమతం చేస్తోంది. నానికి వ్యతిరేకంగా పార్టీ నేతలు నోరువిప్పాలంటే పలుమార్లు ఆలోచన చేయాల్సి వస్తోంది. తాము ఒకటి అంటే కొడాలి నాని పది మాటలు అనడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యింది.
ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇప్పుడు కొడాలి నాని అడ్డాగా మారింది. ఆయన మీద గురిపెట్టిన చంద్రబాబు ఫలితం సాధించలేకపోయారు. తగిన అభ్యర్థి కూడా లేకపోవడంతో మొన్నటి ఎన్నికల్లో దేవినేని అవినాష్ ని దిగుమతి చేసినా గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం గుడివాడ టీడీపీ దాదాపు అనాథలా ఉంది. దాంతో క్షేత్రస్థాయిలో బలం లేక, ఇటు మీడియాలో మాట్లాడలేకపోవడంతో టీడీపీకి కొడాలి నాని కొరకరాని కొయ్యలా మారినట్టు కనిపిస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో ఏకైక కమ్మ మంత్రి కొడాలి నాని. గత అసెంబ్లీలోనే ఆయన మీద టీడీపీ తీవ్ర వ్యాఖ్యలు చేసే ప్రయత్నం సభ సాక్షిగా చేసింది. అయినా వెనక్కి తగ్గకుండా నేను తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరిన అనుభవాలున్నాయి.
ఇప్పుడు అధికారం తారుమారయిన తర్వాత కొడాలి నానికి అమాత్య హోదా దక్కిన తరుణంలో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొన్నిసార్లు మంత్రి స్థాయిని మరచిపోతున్నట్టుంగా ఉందని విమర్శలు వస్తున్నప్పటికీ తన మీద సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం కట్టడి చేసేందుకు అమాత్రం తప్పదని ఆయన భావిస్తున్నారు. లారీ క్లీనర్ అంటూ చేసిన క్యాంపెయిన్ కి నిన్నటితో ముగింపు పడినట్టేనని అంచనా వేస్తున్నారు. సోడా షాప్ వ్యవహారం సీన్ లోకి రావడంతో దేవినేని ఉమా కూడా దానిని ప్రస్తావిచంలేని పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఇంకో అడుగు ముందుకేస్తే తాను రెండడుగులు వేస్తానని తెలుసు కాబట్టి, ఇకనైనా టీడీపీ నేతలు జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదనే సంకేతం కొడాలి ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలకు ఎటూపాలుపోని సందిగ్ధం కనిపిస్తోంది. మొత్తంగా కొడాలి నానికి కౌంటర్ ఇవ్వడం పై ఆపార్టీలో చాలామంది మౌనమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తోంది.