Idream media
Idream media
పెరిగిన జనాభాకు అనుగుణంగా లోక్సభలో సీట్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందనే మాట మూడేళ్లుగా దేశంలో వినిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేత మనీష్ తివారి చేసిన ప్రకటన ఈ అంశంపై మరోసారి చర్చకు దారితీసింది. లోక్సభ సీట్ల సంఖ్యను బీజేపీ ప్రభుత్వం 1000కి పెంచబోతోందని, పార్లమెంట్ నూతన భవనం విస్టాలో లోక్సభ సమావేశ మందిరాన్ని వేయి సీట్లతో నిర్మిస్తోందని మనీష్ పేర్కొన్నారు. 2024 ఎన్నికలలోపే లోక్సభ సీట్లను వేయికి పెంచేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, ఈ విషయంలో ఇతర పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని ఆయన తన వాదనను వినిపించారు. అయితే మనీష్ తివారి మాటల్లో నిజం ఏంత..? లోక్సభ సభ్యుల సంఖ్యను 2024 నాటికి పెంచడం సాధ్యమా..?
రాజ్యాంగం ప్రకారం నిర్మాణం..
భారత రాజ్యాంగంలోని 5వ భాగం, 2వ అధ్యాయంలోని 79 నుంచి 122 వరకు గల ఆర్టికల్స్ భారత పార్లమెంట్ను గురించి పేర్కొంటున్నారు. ఆర్టికల్ 81 లోక్సభ గురించి వివరిస్తోంది. 1952 ఏప్రిల్ 3వ తేదీన రాజ్యసభ ఏర్పాటు కాగా, ఏప్రిల్ 17వ తేదీన లోక్సభ ఏర్పాటైంది. ప్రారంభంలో లోక్సభలో 489 మంది సభ్యులు ఉన్నారు. కాలానుగుణంగా ఈ సంఖ్య మారుతూ వస్తోంది. ప్రారంభంలో 489 మంది ఉన్న సభ్యుల సంఖ్య ఆ తర్వాత 505, 552, 545 చొప్పన మారింది. ప్రస్తుతం లోక్సభలో 545 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 530 మంది రాష్ట్రాల నుంచి, 13 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికవుతున్నారు. మిగతా రెండు సీట్లలో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు.
రాజ్యాంగ సవరణ తప్పనిసరి..
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటే ఆర్టికల్ 81ను సవరించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 81ని సవరించేందుకు 1953, 1963, 1973, 2002లో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్లు ఏర్పాటయ్యాయి. 2002లో చివరిగా ఏర్పాటైన కమిషన్.. 2008లో తన పనిని పూర్తి చేసింది.
Also Read : ఆ సీనియర్ నేత బీజేపీలోనూ ఇమడలేకపోయారా..?
సీట్ల సంఖ్య పెంచే అంశం కాకుండా.. ఇతర సందర్భాల్లోనూ ఆర్టికల్ 81ని సవరించారు. 1952లో మద్రాస్ రాష్ట్రం పునర్విభజన సమయంలో మొదటి సారి ఆర్టికల్ 81ని సవరించారు. ఈ సవరణ ద్వారా మద్రాస్ రాష్ట్రంలోని 75 లోక్సభ సీట్లను పునర్విభజించి ఆంధ్రప్రదేశ్కు 28 సీట్లు కేటాయించారు. 1956లో దేశాన్ని 14 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసే సమయంలో రెండోసారి 81 ఆర్టికల్ను సవరించారు. 1961లో గోవా, డామన్ అండ్ డయ్యూలు దేశంలో విలీనం అయ్యే సమయంలోనూ, 1966లో పంజాబ్ నుంచి హర్యానాను విభజించిన సమయంలోనూ ఆర్టికల్ 81ను సవరించారు.
1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆర్టికల్ 81ని సవరించింది. ఈ సవరణ ప్రకారం 2001 వరకు నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదు. కుటుంబం నియంత్రణా (కు.ని) ఆపరేషన్ల వల్ల ఆయా రాష్ట్రాల విస్తీర్ణం, జనాభాలో తీవ్ర వ్యత్యాసం నెలకొంది. కు.ని శస్త్రచికిత్సలను దక్షిణాది రాష్ట్రాలు ప్రోత్సహించడంతో దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల జనాభా.. ఉత్తర భారత దేశంలోని రాష్ట్రాల కన్నా తక్కువగా ఉంది. జనాభా ప్రకారం లోక్సభ సభ్యుల సంఖ్య ఉండాల్సిన నేపథ్యంలో.. దిగువ సభలో ఉత్తరాధి రాష్ట్రాల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది. (ప్రస్తుతం ఏడున్నర లక్షల మందికి ఒక లోక్సభ సభ్యుడు ఉన్నారు) జనాభా సంఖ్యలో ఉత్తర, దక్షిణ ప్రాంత రాష్ట్రాల మధ్య వ్యత్యాసం తగ్గేవరకూ లోక్సభలో సభ్యులను పెంచకూడదని ఇందిరా గాంధీ రాజ్యాంగ సవరణ చేశారు. చివరగా 1971 జనాభా లెక్కల ప్రకారం 1973లో లోక్సభ సభ్యుల సంఖ్యలో మార్పులు చేసేందుకు ఆర్టికల్ 81ని సవరించారు.
ఆర్టికల్ 81ని సవరించడంపై విధించిన తాత్కాలిక నిషేదం 2001లో ముగియడంతో నాలుగో సారి 2002లో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతోపాటు ఈ సమయంలో 2026 వరకూ మళ్లీ పునర్విభజన చేయకూండా తాత్కాలిక నిషేధం విధించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే అవకాశం ఉన్నా.. అది 2026 వరకూ సాధ్యం కాదని.. సీట్లు పెంచేందుకు యత్నించిన నాటి సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్లకు కేంద్రం తేల్చి చెప్పింది.
Also Read : ఈటల మాటల తూటాలకు టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి
సీట్ల పెంపు ఇప్పుడు సాధ్యమా..?
2024 ఎన్నికల సమయానికి లోక్సభలోని సీట్ల సంఖ్యను 545 నుంచి 1000కి చేయడానికి అనేక అవాంతరాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ ప్రారంభించాలంటే నియోజకవర్గాల పునర్విభజనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి. ఇది జరగాలంటే ఆర్టికల్ 81ని సవరించాలి. ఇందుకోసం లోక్సభలో మూడింట రెండు వంతుల సభ్యుల ఆమోదం కావాలి. ఆ రోజు సభకు హాజరైన వారిలో మూడింట రెండు వంతుల సభ్యులు మద్ధతు తెలిపితే సరిపోతుంది. దీనితోపాటు సగం రాష్ట్ర అసెంబ్లీలు లోక్సభ నిర్ణయాన్ని ఆమోదిస్తూ తీర్మానాలు చేయాలి.
లోక్సభ సీట్లు పెంచేందుకు అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నా.. ఈ ప్రక్రియ ప్రారంభించి పూర్తి చేసేందుకు తగిన సమయం కావాలి. 2002లో ఏర్పాటు చేసిన నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ తన పనిని 2008లో పూర్తి చేసింది. అంటే ఆరు సంవత్సరాల సమయం పట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం చేసేందుకు సిద్ధమైనా.. 545 సీట్లను 1000 సీట్లకు పెంచేందుకు సుదీర్ఘమైన ప్రక్రియ అవసరం. 2024 ఎన్నికలకు కేవలం రెండు సంవత్సరాల పది నెలలు మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో సుదీర్ఘమైన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవడం అసాధ్యమనే చెప్పవచ్చు. లోక్సభ సీట్లను పెంచేందుకు సిద్ధమైతే.. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు డిమాండ్ చేస్తాయి.
Also Read : జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు ..!