iDreamPost
android-app
ios-app

రేపే గ్రేటర్ ఫైట్..

రేపే గ్రేటర్ ఫైట్..

డిసెంబర్ 1న జరిగే గ్రేటర్ వార్‌కు అంతా సిద్ధమయింది. ఇటు రాజకీయ పార్టీలు, అటు ఎన్నికల యంత్రాంగం పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నాయి. బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియకు అవసరమైన పద్ధతిలో ఎన్నికల బూత్‌లు రూపు దిద్దుకున్నాయి. బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ సోమవారం వరకూ కొనసాగాయి. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటేసేందుకు వికలాంగులకు, వృద్ధులకు అనుకూలంగా సౌకర్యాలను కల్పించినట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటింగ్‌కు ఒక రోజు ముందుగా పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ పరిధిలో 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. కొవిడ్ నిబంధనలతో పాటు ప్రజలకు సౌకర్యవంతంగా ఓటింగ్‌ను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటింగ్ నిర్వహించేందుకు ఆయా వార్డుల్లోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు కమ్యూనిటీ హాల్స్, ప్రైవేట్ స్కూల్స్ భవనాలను కూడా ఉపయోగించుకుంటున్నారు. ఎన్నికల అధికారులు, సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలు, విద్యుత్ వసతిపై జీహెచ్ఎంసీ నుంచి పోలింగ్ కేంద్రాలను సందర్శించి, కొరత ఉన్నవాటిపై రిపోర్టులు తయారు చేసి సమకూర్చారు. మరో మూడు నెలల్లో పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మున్సిపల్ యాక్ట్ ప్రకారం ముందు మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం నవంబర్ 17న గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. టీఆర్ఎస్ నుంచి అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా… బీజేపీ 149, కాంగ్రెస్ -146 స్థానాల్లో పోటీలో దిగుతున్నాయి. నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రచారానికి వచ్చేవారికి బిర్యానీలు, వాహనాలు, డబ్బులు వంటివాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో 150 డివిజన్లలో 1,122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల రోజు 1న మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కోవిడ్ నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ జరగనుంది. అత్యధికంగా కొండాపూర్ డివిజన్‌లో 99 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో 45 వేల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 74,44,260 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గ్రేటర్‌లో అతిపెద్ద డివిజన్‌ మైలార్‌దేవ్‌పల్లి కాగా, చిన్న డివిజన్‌ ఆర్‌సీ పురం.

పోలింగ్ కేంద్రాల వికలాంగులకు, వృద్దులకు ప్రత్యేక వీల్‌చైర్లు ఏర్పాటు చేశారు. పోలింగ్​ ప్రక్రియలో భాగంగా 90 శాతానికి పైగా ఓటర్లకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసేందుకు వచ్చే వికలాంగులు, వృద్ధులకు ఉపయోగపడేలా ర్యాంప్‌లు నిర్మిస్తున్నారు. బూత్‌కొక వీల్ ఛైర్‌ను సమకూరుస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. వీల్‌చైర్లు తీసుకెళ్లేందుకు, వృద్ధాప్యం, తక్కువ వైకల్యం కలవారు నిడిచేందుకు వీలుగు ఉండేందుకు పోలింగ్ రూముల ముందు ర్యాంప్‌లు నిర్మించారు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్‌లో ఎన్నికల నిర్వహించేందుకు అవసరమైన పద్ధతిలో మార్చేందుకు మరింత సమయం కావాలని కోరడంతో సోమవారం రోజు భవనాలు అప్పగించే అవకాశం ఉంది. అదే రోజు పోలింగ్ కేంద్రాలకు వీల్ ఛైర్లను, ఇతర సామాగ్రిని తరలిస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులు తెలిపారు. కొవిడ్ నిబంధనలతో ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుకోసం శానిటైజర్లను సర్కిల్ డీఆర్‌సీ కేంద్రాలకు ఇప్పటికే సరఫరా చేశారు. ఎన్నికల ముందు రోజు శానిటైజర్లను కూడా పోలింగ్ కేంద్రాలకు అందించేలా చర్యలు తీసుకున్నారు.

రాజకీయ పార్టీలు కూడా…

వేడి పుట్టించే మాటలు బాణాలు, రెచ్చగొట్టే పరస్పర వ్యాఖ్యలకు నిన్నటితో గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. పది రోజులుగా నినాదాలు, మైక్‌లతో హోరెత్తిన వీధులు, కాలనీలకు విశ్రాంతి లభించింది. అభ్యర్థుల గెలుపు కోసం గల్లీ నుంచి ఢిల్లీ నాయకుల వరకూ హైదరాబాద్ బాట పట్టారు. ఎలాగైనా గెలుపు లక్ష్యంతో అభ్యర్థులు ప్రచారంలో తమ సత్తా నిరూపించుకునే ప్రయత్నాలు చేశారు. ఇక ఓటింగ్ మాత్రమే మిగిలిఉండటంతో ఒక రోజు ముందు రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్రాలను ఆదివారం నుంచే మొదలు పెట్టాయి. మరో వైపు బల్దియా ఎన్నికల అధికారులు తమ పని తాము చేసుకు వెళ్తున్నారు. ప్రచారంలో అభ్యర్థుల తీరును గమనించడంతో పాటు ఓటింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, బందోబస్తులను చేపడుతున్నారు.

పార్టీల తరుపున అగ్ర నేతలు ప్రచారం చేశారు. అధికార టీఆర్​ఎస్​ పార్టీ నుంచి మంత్రులు డివిజన్లలో ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు అమిత్​షా, స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగితో పాటు పలువురు ప్రచారం చేశారు. కాంగ్రెస్​ నుంచి టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​, వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి ప్రచారం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఆయా రాజకీయ పార్టీలు సాధ్యమైనంత ఎక్కువగా, పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించాయి. నగరంలోని అన్ని డివిజన్లలో ప్రధాన పార్టీల పాదయాత్రలు, అభ్యర్థుల పర్యటనలే కనిపించాయి. ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలతో పార్టీలు బిజీగా కనిపించాయి. అభ్యర్థుల వాహనాల ర్యాలీలు, కార్యకర్తల ప్రదర్శనలతో నగరం రోడ్లు నిండిపోవడంతో సాధారణ వాహనదారులు ట్రాఫిక్ జామ్‌ల్లో ఉండక తప్పలేదు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం, లెఫ్ట్, స్వతంత్ర అభ్యర్థులు.. ఇలా ఎవరని తేడా లేకుండా అభ్యర్థులు చివరి రోజు ప్రచారాన్ని హోరాహోరిగా నిర్వహించారు.

టీఆర్ఎస్ బహిరంగ సభ, కేటీఆర్ రోడ్ షో, బీజేపీ రోడ్ షో, ప్రచారాలకు తీసుకెళ్లిన జనాలకు ఆదివారం నుంచి డబ్బులు పంచే కార్యక్రమాలు అన్ని చోట్ల కొనసాగాయి. ప్రచారం ముగియడంతో గంపగుత్తగా ఓట్లు వేయించే వ్యక్తులపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఓటర్లను నేరుగా కలిసి డబ్బులు ఇచ్చేలా సిద్ధమవుతున్నారు. కొన్ని డివిజన్లలో అభ్యర్థులు ఒకడుగు ముందుకేసి డబ్బుతో పాటు బహుమానాలను కూడా అందించారు. క్యాష్ తీసుకెళుతున్నపుడు ప్రత్యర్థి పార్టీల నాయకులు అడ్డుకోవడం, ఇబ్బందులు కలిగిస్తుండటంతో కొందరైతే..గిఫ్ట్ ఓచర్లు, షాపింగ్ కూపన్ల పంపకానికి తెరతీశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే పలు ప్రాంతాల్లో అభ్యర్థులు డబ్బులు అందజేసే కార్యక్రమాన్ని షురూ చేశారు. ఐదు లక్షలకు మించి అభ్యర్థులు ఖర్చు చేయొద్దని ఎన్నికల నిబంధనలు చెబుతున్నా.. పది రోజుల ప్రచారానికే ఒక్కో అభ్యర్థి రూ. 25 లక్షలకు తగ్గకుండా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. కీలకమైన, ప్రతిష్టాత్మక స్థానాల్లో కొందరు అభ్యర్థులు అర కోటి పైనే ఖర్చు చేసినట్టు సమాచారం.

గ్రేటర్ ఓటర్లు: 74,44,260
పురుషులు: 38,77,688
స్త్రీలు: 36,65,896
ఇతరులు: 676

జీహెచ్ఎంసీ సర్కిళ్లు: 30
జీహెచ్ఎంసీ వార్డులు:150
పోలింగ్ సమయం: ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ
పోలింగ్ లొకేషన్లు: 2,909
పోలింగ్ కేంద్రాలు: 9,101
తీవ్ర సమస్యాత్మకమైనవి: 1,752
సమస్యాత్మకమైనవి: 2,934
సాధారణమైనవి: 4,415
వెబ్ కాస్టింగ్: 2,277

మొత్తం పోలింగ్ సిబ్బంది: 48,000
బ్యాలెట్ బాక్స్‌లు: 28,683
పోలీసు సిబ్బంది: 52,500

పోస్టల్ బ్యాలెట్స్ : 2,831
ఉద్యోుగులకు: 2,571
కోవిడ్, 80 ఏండ్ల వృద్ధులకు: 260