iDreamPost
iDreamPost
గుంటూరు నగరం నడిబొడ్డులో ఉన్న జిన్నా టవర్ కి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏడు దశాబ్దాలుగా అది నగర జీవనంలో మమేకమయ్యింది. ప్రధాన వ్యాపార కూడలిగా ఉంది. కార్పోరేషన్ కార్యాలయానికి చేరువలో కొలువుదీరి ఉంటుంది. ప్రపంచంలోనే ముహమ్మద్ ఆలీ జిన్నా పేరుతో ఉన్న ఏకైక టవర్ గుంటూరులో ఉండడం పాకిస్తానీలను సైతం ఆశ్చర్యపరిచింది. లౌకిక భారత దేశ ప్రతిష్టకు కొలబద్ధగా ఉంది. దేశ స్వతంత్ర్యోద్యమానికి ముందే నిర్మించిన ఈ కట్టడం చారిత్రక వారసత్వ సంపదగా మారింది. దానిని పరిరక్షించేందుకు గుంటూరు నగర పాలక సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతోంది.
జిన్నా టవర్ ఆధారంగా గుంటూరులో మత రాజకీయాలకు కొందరు ప్రయత్నం చేశారు. టవర్ పేరు మార్చాలనే ప్రతిపాదనలో బీజేపీ నేతలు కొంత హడావిడి చేశారు. అదే సమయంలో బీజేపీ మత రాజకీయాలకు జగన్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే అనేక అంశాలలో ఈ వ్యవహారం కనిపించింది. అంతర్వేది రథం తగులబడిన కేసులో పాతరథానికి మించిన వైభవంతో కొత్తరథం సకాలంలో సిద్ధంచేసి జగన్ సర్కారు చిత్తశుద్ధిని చాటింది. రామతీర్థం చుట్టూ రగడ రాజేయాలని చూస్తే సంకల్పం చాటుకున్న జగన్ ప్రభుత్వం అందరినీ ఆకట్టుకుంది. ఇలా అన్ని సందర్భాల్లోనూ మత విద్వేషాలు రగల్చాలని టీడీపీ, బీజేపీ నేతలు కూడా ఉమ్మడిగా యత్నంచేసినా జగన్ మాత్రం దానికి విరుగుడు మంత్రం ప్రదర్శిస్తున్నారు. గుంటూరు టవర్ వ్యవహారంలో కూడా జగన్ ముందుచూపుతో వ్యవహరించారు. ఏపీలో మైనార్టీ జనాభా ప్రబలంగా ఉండే నగరాల్లో గుంటూరు ఒకటి.
సుదీర్ఘకాలంగా మత సామరస్యానికి కేంద్రంగా ఈ నగరం నిలుస్తోంది. ఇక్కడ కూడా విద్వేషాలు రగిల్చే యత్నం మొదలుకాగానే జగన్ అప్రమత్తమయ్యారు. మరొకరికి అవకాశం లేకుండా జిన్నా టవర్ కి జాతీయ జెండా త్రివర్ణ పతాక రంగులు అద్దేశారు. జాతీయ జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేశారు. టవర్ చుట్టూ పటిష్ట భద్రత కోసం గ్రిల్స్ నిర్మించారు. మొత్తంగా జిన్నా టవర్ చారిత్రక ప్రాధాన్యతను పరిరక్షిస్తూ మరింత జాతీయ స్ఫూర్తిని రగిల్చే వేదికగా తీర్చిదిద్దారు. దాంతో టవర్ కేంద్రంగా మత రాజకీయాలకు యత్నించిన వారికి చెక్ పెట్టడమే కాకుండా గుంటూరు నగరంలో తలమానికమైన చారిత్రక కట్టడంగా మార్చారు.
జగన్ ప్రభుత్వ చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు. నగర విశిష్టతను, చరిత్రను కాపాడుతూ లౌకిక భారత ఘనతను చాటేలా జిన్నా టవర్ ని మార్పులు చేసినందుకు అభినందిస్తున్నారు. మూడు రంగులతో అందంగా మారిన జిన్నా టవర్ సెంటర్ చూసి ప్రభుత్వ చొరవను కొనియాడుతున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో మత రాజకీయాలకు వేదిక కాకుండా సకాలంలో చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వ తీరుని పలువురు మెచ్చుకుంటుండడం విశేషం.
Also Read : గుంటూరు జిన్నా టవర్ చరిత్ర తెలుసా, విద్వేషాలు రగల్చడమే లక్ష్యమా..