iDreamPost
android-app
ios-app

Palle Raghunath reddy – పుట్టపర్తి టీడీపీలో మాజీమంత్రి స్థానంలో కొత్త అభ్యర్ధి?

  • Published Dec 19, 2021 | 8:06 AM Updated Updated Mar 11, 2022 | 10:31 PM
Palle Raghunath reddy – పుట్టపర్తి టీడీపీలో మాజీమంత్రి స్థానంలో కొత్త అభ్యర్ధి?

అంతర్గత కలహాలకు నిలయంగా మారిన అనంతపురం జిల్లా టీడీపీ విభేదాలు మరో నియోజకవర్గానికి పాకాయి. పుట్టపర్తి నియోజకవర్గ పార్టీలో బీసీ నినాదం కాక రేపుతోంది. నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ప్రత్యర్థివర్గం పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన సీటుకు ఎసరు పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీన్ని గుర్తించిన పల్లె.. తనకు వ్యతిరేకంగా పనిచేసే వారిని పార్టీ వ్యతిరేకులుగా పరిగణించి వేటు వేస్తామని హెచ్చరించడంతో పాటు గ్రామాల్లో పర్యటిస్తూ తనకు మద్దతుగా టీడీపీ శ్రేణులను కూడదీసే ప్రయత్నాలు ప్రారంభించారు.

పార్టీలో పెరుగుతున్న వ్యతిరేకత

విద్యావేత్త అయిన పల్లె రఘునాథరెడ్డి టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో మొదటిసారి నల్లమాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో ఎమ్మెల్సీ అయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఏర్పడిన పుట్టపర్తి నియోజవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో గెలిచినా 2019లో ఓటమిపాలయ్యారు. మంత్రిగా, చీఫ్ విప్ గా పనిచేసిన ఆయన ప్రస్తుతం పుట్టపర్తి ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. పార్టీలోని ఒక వర్గం కొన్నాళ్లుగా ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నా.. అది చాప కింద నీరులా ఉండేది. ఇటీవల అది కాస్త బయటపడుతోంది. పల్లెతో పలు అంశాల్లో విభేదిస్తున్న పుట్టపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ బి.సి.గంగన్న ఆధ్వర్యంలో పల్లె వ్యతిరేక కార్యక్రమాలు జోరందుకున్నాయి.

బీసీ అభ్యర్థి వస్తారని ప్రచారం

వ్యతిరేక వర్గీయులు పల్లెకు వ్యతిరేకంగా బీసీ కార్డ్ ప్రయోగిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గానికి బీసీ అభ్యర్థి వస్తారని ప్రచారం చేస్తున్నారు. ఇదే లక్ష్యంతో ఇటీవల నిర్వహించిన ఒక సమావేశానికి మాజీ ఎంపీ నిమ్మల క్రిష్ణప్ప సైతం హాజరయ్యారు. ఇంతకాలం తన వ్యతిరేకుల కార్యకలాపాలను పెద్దగా పట్టించుకోని పల్లె.. వారి సమావేశానికి మాజీ ఎంపీ హాజరుకావడంతో ఆగ్రహం చెందారు. తాను ఇన్చార్జినని.. తనకు, పార్టీకి వ్యతిరేకంగా కార్యకర్తలను తప్పుదోవ పట్టించేవారిపై వేటు వేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో పర్యటిస్తూ నాయకులు, కార్యకర్తలను సమీకరిస్తున్నారు. అందరం కలిసి పార్టీ విజయానికి పనిచేద్దామని పిలుపునిస్తున్నారు. ఇటు పల్లె.. అటు ఆయన ప్రత్యర్థుల ప్రచారాలు, కార్యకలాపాలతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.

Also Read : పి.గన్నవరం.. రోడ్డెక్కిన తమ్ముళ్ల కుమ్ములాటలు