Idream media
Idream media
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. వైరస్ భారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పేరుగుతోంది. సామాన్యులతోపాటు ప్రముఖులకు కరోనా వైరస్ సోకడం కలవరపెడుతోంది. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్కు, ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్లోని ఓ మంత్రికి వైరస్ సోకడం కలకలం రేపుతోంది.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 1.31 లక్షలు దాటగా.. ఒక్క మహారాష్ట్రలోనే 50 వేల మంది ఈ వైరస్ భారిన పడ్డారు. ఇక మహారాష్ట్రలో నమోదైన మొత్తం కేసుల్లో 30 వేల కేసులు రాజధాని ముంబైలోనే నమోదు కావడం దేశ ఆర్థిక రాజధానిలో వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో రోజు రోజుకీ వైరస్ భారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజూ ఆరువేల మంది ఈ వైరస్ భారినపడుతున్నారు. లాక్ డౌన్ను క్రమంగా ఎత్తివేస్తున్న కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలతోపాటు ప్రజా రవాణాను పాక్షికంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కనుగోనడంలో తలమునకలై ఉన్నాయి. భారత్లో కూడా పలు సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పలేమన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్.. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల ఆధారంగా వ్యాక్సిన్ మరో ఏడాదిలో వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పటి వరకు ప్రజలు వైరస్ సోకకుండా మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేస్తూ తమను తాము కాపాడుకోక తప్పదు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 55 లక్షలకు చేరుకున్నాయి. అమెరికాలో పాజిటివ్ కేసులు 17 లక్షలకు చేరుకోగా.. మరణించిన వారి సంఖ్య లక్షకు చేరుకుంది. అమెరికాతోపాటు బ్రిటన్, రష్యా, జపాన్, ఇజ్రాయెల్, చైనా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాక్సిన్ పరిశోధనలు ముమ్మురంగా సాగుతున్నాయి.