iDreamPost
iDreamPost
ఈనాడు మాత్రమే కాదు, మొత్తం చంద్రబాబు సన్నిహితులంతా అమరావతి కోసం ఆరాటపడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రత్యేకంగా రామోజీరావుని ఆహ్వానించి, ఆయన కోసం ఏకంగా సీఎం సైతం ఫిల్మ్ సిటీకి పరుగులు తీసిన నేపథ్యం కూడా తోడ్పడి ఉండవచ్చు. అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఏదో లాంఛనంగా ఆహ్వానించడమే తప్ప మనస్ఫూర్తిగా భాగస్వామిని చేద్దామనే ఆలోచన లేని ప్రభుత్వం రామోజీరావుకి మాత్రం అంగరంగ వైభవంగా అతిథి మర్యాదలు చేసింది. చంద్రబాబు నాయుడికి ఆయన చేసిన సహాయానికి అది రుణం తీర్చుకోవడమన్నట్టుగా అప్పట్లో పలువురు వ్యాఖ్యానించారు కూడా.
ఆ తర్వాత పాలనా వికేంద్రీకరణ చట్టం అమలులోకి తీసుకొస్తూ అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చిన నాటి నుంచి ఈనాడు వక్రభాష్యాలు అన్నీ ఇన్నీకావు. పచ్చ మీడియాలో ఓ భాగం పచ్చిగా ప్రభుత్వంపై దాడి చేస్తుంది. ఈనాడు మాత్రం నంగనాచిలా తన రాతల వెనుక ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. బాహాటంగా తాను అమరావతికి అండగా ఉన్నామని చెప్పకుండానే అమరావతి ఉద్యమం పేరుతో రోజుకో పేజీ మాత్రమే కాకుండా, కొన్ని సార్లు రెండు మూడు పేజీలు సైతం కేటాయిస్తే అక్కడేదో ప్రజా ఉద్యమం జరిగిపోతోందనే అభిప్రాయం అందరిలో కలిగించే ప్రయత్నం చేసింది. ఎంత ప్రయత్నం చేసినా అమరావతి కోసం చేసిన ప్రయత్నం ప్రజా ఉద్యమంగా మలచలేకపోవడం వర్తమానంలో ఈనాడు పరిస్థితిని, దాని ప్రభావ పరిమితులను చాటిచెబుతుంది.
తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు తెరమీదకు రాగానే ఈనాడు మరోసారి అమరావతికి ముడిపెడుతూ తన మార్క్ జర్నలిజపు ప్రతిభను చాటుతోంది. జిల్లా కేంద్రాల ఎంపికలో ఓ మాట, రాష్ట్ర రాజధాని విషయంలో మరో రూలా అంటూ చిలకపలుకులు వల్లించింది. అదే క్రమంలో గ్రామ సచివాలయాల ద్వారా పాలనా వికేంద్రీకరణ చేసినప్పుడు, ప్రజల వద్దకే పాలన చేర్చినప్పుడు ఇక కొత్తగా జిల్లాల విభజన ఎందుకూ అంటూ ప్రశ్నలు కూడా సంధించింది. జిల్లా కేంద్రాల అంశంలో ప్రభుత్వ వాదన ఒకదానికి మరొకదానికి పొంతన లేదంటూ వ్యాఖ్యానించింది.జిల్లా కేంద్రాలు అందరికీ అందుబాటులో ఉండాలి అని ప్రభుత్వ వాదనకు రాష్ట్ర రాజధాని కూడా అదే తరహాలో ఉండాలి కదా అని ప్రశ్నించింది.
ఈనాడు రాసింది చదివేసి నిజమనుకునే సెక్షన్ తగ్గిపోయింది కాబట్టి సరిపోయింది గానీ లేదంటే ఆహా నిజమే కదా అనిపించేలా ఈనాడు వక్రబుద్ధిని ఆకట్టుకునేలా ప్రదర్శిస్తుంది. తాజాగా ప్రభుత్వ వాదననే తిరగేసి వినిపించి పాఠకులను తికమక పెట్టే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వం ఏం చెబుతోంది..
పాలన గ్రామ స్థాయి వరకూ తీసుకెళ్లాం, తద్వారా ప్రజలకు అన్ని సేవలు గ్రామాల్లో అందిస్తున్నాం.. అంతకుమించిన సమస్యలుంటే అందుబాటులో జిల్లా కేంద్రాలుండేలా చేస్తున్నాం..తద్వారా ప్రజా సంక్షేమానికి ఆటంకం లేకుండా, అభివృద్ధికి ప్రయత్నిస్తున్నామంటోంది. ఇక రాష్ట్ర,కేంద్ర విషయాలలో నూటికి ఒకటి, రెండు శాతానికి మించి సెక్రటేరియేట్ కి రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి పాలనా వికేంద్రీకరణను దృష్టిలో పెట్టుకుని మూడు రాజధానులు అంటోంది.
దీనిని ఈనాడు ఎలా వక్రీకరించిందంటే..రాష్ట్ర సెక్రటేరియేట్ అందరికీ అవసరం లేనప్పుడు జిల్లా కలెక్టరేట్లు కూడా ఎందుకూ అంటూ ప్రశ్నిస్తోంది. ఇదే ఈనాడు వక్రభాష్యపు కథనం. అంటే ప్రజలకు పాలన చేరువకావడం, రాష్ట్ర సచివాలయం వరకూ రాకుండా సమస్యలు పరిష్కారం కావడం, అందుకోసం జిల్లాల విభజన ద్వారా కలెక్టర్ కార్యాలయాలు అందుబాటులో ఉండడం ఈనాడుకి ఇష్టం లేదా.. అనే అనుమానం వస్తుంది. అయితే చంద్రబాబు చేయలేకపోయారు కాబట్టి, జగన్ చేసి చూపించడమే ఈనాడుకి ఇష్టం లేదని అర్థం చేసుకోవాలి. అమరావతిలోనే అన్నీ పెట్టేసి అక్కడ భూములు కొనుగోలు చేసిన ఈనాడు యాజమాన్యం సహా వారి మిత్రులకు మాత్రమే మేలు చేసేందుకు జగన్ సిద్ధంగా లేరు కాబట్టి ఇంకెవరికీ ప్రయోజనం దక్కడాన్ని జీర్ణించుకోలేకపోతోందని భావించాలి. ఏమయినా ఈనాడు రాతలకు అర్థాలే వేరులే అని జనం గ్రహించిన తరుణంలో ఈ వ్యవహారం పెద్ద విశేషం కాదు.
Also Read : ఎన్టీఆర్ పేరు పెడితే థ్యాంక్స్ కూడ చెప్పరా బాబు?