iDreamPost
android-app
ios-app

అమరావతిలో జెఫ్రీ ఆర్చర్ ప్లాన్ !

అమరావతిలో జెఫ్రీ ఆర్చర్ ప్లాన్ !

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బ్రిటిష్ రచయిత జెఫ్రీ ఆర్చర్ రచయిత కాకముందు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. ఒక పత్రిక మీద పరువునష్టం దావా గెలిచి, అందులో భాగంగా ప్రమాణం చేసి అబద్ధం చెప్పినట్లు ఆ తర్వాత తేలడంతో కొన్నాళ్ళు జైలుశిక్ష అనుభవించాడు. ఈ కేసుల వల్ల దివాలా తీసినా, వాటి వల్ల చట్టం, లాయర్లు, జడ్జీల గురించి మంచి పరిఙానం అబ్బింది. దాన్ని ఉపయోగించి Not a Penny More Not a Penny Less అనే నవల రాసి, అది సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వరుసగా నవలలు రాసి బెస్ట్ సెల్లింగ్ రైటర్ అయ్యాడు. ఇతర టాప్ రైటర్స్ లాగా నవలలకు పరిమితం కాకుండా ఆర్చర్ చిన్న కథలు కూడా చాలా రాశాడు. వాటిని సంకలనంగా వెలువరిస్తే అవి కూడా బాగా అమ్ముడు పోయాయి.

ఆర్చర్ రాసిన కథల్లో చావుకు దగ్గరయి, మంచానికి పరిమితమైన కోటీశ్వరుడు కథ ఒకటి ఉంది. అతనికి ఇంట్లో ఉండి సేవలు చేయడానికి ఒక నర్సుని నియమించిన బంధువులు ఎప్పుడు పోతాడా, పోయే ముందు తమకు ఆస్తి వీలునామా రాసిపెట్టి పోతాడు కదా అని ఎదురు చూస్తూ ఉంటారు. అతనికి సేవలు చేసే నర్సు ప్రేమగా అతని అవసరాలు చూసుకుంటూ, సబ్బు నీటితో శరీరాన్ని తుడిచే సమయంలో అతని వంటి మీద అక్కడక్కడా తడుముతూ చావు కోసం ఎదురు చూస్తూ, నిస్తేజంగా ఉన్న అతనిలో కొంత చైతన్యం నింపుతుంది.

కొన్ని రోజుల్లో ఆ కోటీశ్వరుడు మరణిస్తాడు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక బంధువులు అందరూ ఇంట్లో చేరి ఉండగా చనిపోయిన కోటీశ్వరుడి లాయర్ కోర్టు ప్రతినిధితో కలిసి వచ్చి, అతను రాసిన వీలునామా ఉన్న సీల్డ్ కవర్ విప్పి చదువుతాడు. అందరూ షాకయ్మేలా ఆస్తిలో ఎక్కువ భాగం తనకు సేవలు చేసిన నర్స్ పేరిట, బంధువులకు తలా కొంచెం రాసి ఉంటాడు.

“ఆ పిల్ల ఏదో మందు పెట్టి ఇలా రాయించుకుంది. కోర్టుకు వెళ్తాం.మా ఆస్తి మేం దక్కించుకుంటాం” అంటారు బంధువులందరూ ఏక కంఠంతో. “అది కష్టం” అంటాడు లాయరు. “ఎందుకు కష్టం? మంచి లాయర్ని పెట్టుకుంటాం. ఆ పిల్ల మోసం చేసిందని నిరూపించడం చిటికెలో పని.”

“ఆ పిల్ల తెలివిగా తనకు ఒక్కదానికే కాకుండా, అమెరికా అధ్యక్షుడు నిధికి , అమెరికా సైన్యం సంక్షేమ నిధికీ, హార్వర్డ్ యూనివర్సిటీకి, స్మిత్సానియన్ మ్యూజియంకీ తలా కొంత రాయించింది. ఇప్పుడు మీరు కోర్టుకెక్కితే వారందరూ ప్రతివాదులుగా చేరుతారు. వారి తరఫున వాదించే లీగల్ టీమ్స్ తో పోటీపడగల టైమూ, డబ్బూ మీకు ఉన్నాయేమో చూసుకోండి”ఆసలు విషయం చల్లగా చెప్తాడు లాయర్.

అమరావతిలో మనకూ, మన బినామీలకే కాకుండా జడ్జిలకూ, వారి బంధువులకూ కూడా స్థలాలు కట్టబెడితే అమరావతి స్థలాల విలువ తగ్గకుండా, అమరావతి బ్రాండ్ వేల్యు తగ్గకుండా వాళ్లు చూసుకుంటారు అన్నది అద్భుతమైన ఆలోచన!!