iDreamPost
iDreamPost
వ్యక్తికి గానీ, సంస్థకు గానీ నష్టం కలిగేలా, బురద చల్లే ప్రయత్నాలు ఏ మీడియా చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ హితవు పలికారు. ఏపీలో మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దుష్ప్రచారంపై శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న జీవోపై కొందరు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని.. నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వారు రాసిన వార్తలు నిజమైతే.. కోర్టుల ద్వారా రక్షణ పొందవచ్చని అన్నారు.
మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలని గతంలోనే పలు చర్చలు జరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పత్రికలకు ప్రత్యేకమైన స్వేచ్ఛ ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచకపోయినా.. ఎన్నో ఏళ్లుగా మీడియాకు స్వేచ్ఛ అనే అంశాన్ని అందరూ గౌరవిస్తున్నారని గుర్తుచేశారు. కానీ కొంతకాలంగా రాజకీయ అండదండలతో, కొందరికే స్వలాభం కలిగేలా వార్తలు ప్రచురిస్తున్నారని తెలిపారు.