iDreamPost
android-app
ios-app

పోలవరం పనులు జరగటం లేదా?కళ్ళు తెరిచి చూడండి దేవినేని ఉమా గారు..

  • Published Sep 06, 2021 | 7:01 AM Updated Updated Sep 06, 2021 | 7:01 AM
పోలవరం పనులు జరగటం లేదా?కళ్ళు తెరిచి చూడండి దేవినేని ఉమా గారు..

పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల విష‌యంలో టీడీపీ వితండ‌వాద‌నకు హద్దూప‌ద్దూ లేద‌న్నట్టుగా క‌నిపిస్తోంది. ప‌నులు సాగుతున్న తీరు మీద టీడీపీ నేత‌ల తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా క‌నిపిస్తోంది. ప‌నులు జ‌రుగుతున్న విష‌యం స్పిల్ వే ద్వారా మ‌ళ్లించిన న‌దీ ప్ర‌వాహం ఎదురుగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ ప‌నులు సాగ‌డం లేద‌ని, అంతా డ్రామాలాడుతున్నార‌ని విమ‌ర్శించ‌డానికి పూనుకోవ‌డం విశేషంగా మారింది.

ముఖ్యంగా దేవినేని ఉమా మీడియా సాక్షిగా చేసిన వ్యాఖ్య‌లు వారి నైజాన్ని చాటుతోంది. రాష్ట్రానికి ఇరిగేష‌న్ మంత్రి ఉన్నారా అంటూ ఈ మాజీమంత్రి ప్ర‌శ్నించడం విడ్డూరంగా క‌నిపిస్తోంది.2018 నాటికే పోల‌వ‌రం నుంచి నీళ్లు ఇస్తాం,రాసి పెట్టుకో జగన్ అని చెప్పిన ఇదే దేవినేని ఉమా, ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయ‌లేద‌ని ప్ర‌శ్నించ‌డ‌మే విచిత్రంగా క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల మీద‌ మొస‌లిక‌న్నీరు కారుస్తూ నిర్వాసితుల ప‌ట్ల ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శించ‌డం విశేషంగా మారుతోంది. పైగా కాఫ‌ర్ డ్యామ్ నిర్మాణం పీపీఏ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిందే త‌ప్ప తాము క‌ట్ట‌లేద‌ని దేవినేని ఉమా బుకాయించ‌డానికి సిద్ధంకావ‌డం చూస్తుంటే టీడీపీ నేత‌ల అస‌లు నైజం బ‌య‌ట‌ప‌డుతుంది.

నిజానికి పోల‌వ‌రం ప్రాజెక్టు జాతీయ హోదా ద‌క్కిన త‌ర్వాత 2014 నుంచి 2016 వ‌ర‌కూ ప‌నులు సాగ‌లేద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. స్పెష‌ల్ ప్యాకేజీ పేరుతో రాష్ట్రాన్ని ఉద్ద‌రించేందుకు తాము సాధించామ‌ని అసెంబ్లీ సాక్షిగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన వాటిలో పోల‌వ‌రం ప్రాజెక్టు కూడా ఉంది. అయితే పోలవరం అంచనాల మీద కేంద్రాన్ని నిలదీయకుండా,అప్పటి అంచనాలు దాదాపు 50 వేల కోట్లకు ఎలాంటి ఆమోదం పొందకుండా స్పెషల్ ప్యాకేజి ని అంగీకరించి పోలవరం భవిషత్తును ప్రమాదంలోకి నెట్టారు. ఇప్పుడు అదే శాపం గా మారింది.

Also Read:ఏపీ సీఎస్ ఆదిత్యానాద్ దాస్ కి మరో అవకాశం ఇస్తారా, శ్రీలక్ష్మి రేసులోకి వస్తారా?

ఆ త‌ర్వాత రెండేళ్ల‌లో పూర్తి చేస్తామ‌ని ఆనాటి ఇరిగేష‌న్ మంత్రి దేవినేని ఉమా అసెంబ్లీ సాక్షిగా స‌వాల్ కూడా చేశారు. కానీ తీరా చూస్తే చంద్ర‌బాబు గ‌ద్దె దిగే నాటికి ప్రాజెక్టు ప‌నుల‌కు సంబంధించి కేవ‌లం 67 శాతం మాత్ర‌మే పూర్త‌యిన‌ట్టు అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి. అప్ప‌టికే వైఎస్సార్ హ‌యంలో పూర్త‌యిన కాలువ‌లు, ఇత‌ర ప‌నుల‌న్నీ క‌లుపుకుంటే మూడింట రెండు వంతుల ప‌నులు జ‌ర‌గ్గా, చంద్ర‌బాబు హ‌యంలో కేవ‌లం 30 శాతం లోపు ప‌నులు జ‌రిగాయి. అది కూడా కేంద్రం నిధులు ఇచ్చిన త‌ర్వాత‌. పైగా కేంద్రం ఇచ్చిన నిధుల‌ను చంద్ర‌బాబు ఒక ఏటీఎంలా మార్చుకున్నార‌ని స్వ‌యంగా ప్ర‌ధాన మోదీ అక్క‌డ జ‌రిగిన అవినీతిని చాటిచెప్పారు.

టీడీపీ హ‌యంలో పూర్తికావాల్సిన స్పిల్ వే కూడా అసంపూర్తిగా నిలిచిపోయింది. 1,200 మీటర్ల పొడవున 28 నుంచి 33 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టి మధ్యలోనే వదిలేసింది.  వరద వలన  డయాఫ్రమ్‌ వాల్‌ కొంతమేర దెబ్బతింది. ఇసుక పొరలు కోతకు గురయ్యాయి.ఇక స్పిల్‌ వేలో 53 బ్లాక్‌ల పియర్స్‌ను సగటున 22 మీటర్ల ఎత్తున చేసింది. 25.72 మీటర్ల ఎత్తు నుంచి 45.72 మీటర్ల ఎత్తు వరకు 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో స్పిల్‌ వేకు 48 గేట్లను బిగించాల్సి ఉన్నా టీడీపీ బాధ్య‌తారాహిత్యం వ‌ల్ల ప‌నులు మిగిలిపోయాయి. అయిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ల‌క్ష్యంతో 42, 43 పియర్స్‌ను 34 మీటర్ల ఎత్తు వరకూ చేసి వాటి మధ్య ఒక ఇనుప రేకును అడ్డుగా పెట్టి గేట్లు బిగించేసినట్లు న‌డిపిన డ్రామా చూస్తే అస‌లు నాట‌కాలు ఆడుతున్న‌దెవ‌ర‌న్న‌ది అర్థ‌మ‌వుతుంది.

అంతేగాకుండా నదీ ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించేందుకు అప్రోచ్‌ చానల్‌ తవ్వకం పనులు చేపట్టలేదు. స్పిల్‌ చానల్‌ పనుల్లో మట్టి పనులు.. కొంత మేర కాంక్రీట్‌ పనులు మాత్రం చేసి చేతులు దులుపుకుంది. జల విద్యుత్‌ కేంద్రం పనుల్లో పునాది పనులకుగాను కొండను 18 మీటర్ల మేర మాత్రమే టీడీపీ సర్కార్‌ తవ్విన‌ప్ప‌టికీ ఇప్పుడు అంతా తానే చేశాన‌ని చెప్పుకోవ‌డానికి సాహ‌సించ‌డం విశేషం.

Also Read:జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించ‌కుండా చేయ‌గ‌ల‌రా?

గ‌డిచిన రెండేళ్ల‌లో అనేక ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి. ముఖ్యంగా క‌రోనా మూలంగా వ‌చ్చిన ఇబ్బందులు, ఆర్థిక స‌మ‌స్య‌ల‌కు తోడుగా ప‌నులు స‌గం స‌గం చేసి వ‌దిలేసిన చోట్ల అద‌న‌పు భార‌మ‌య్యింది. అయినా జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత న‌దీ ప్ర‌వాహం మ‌ళ్లించేందుకు అనుగుణంగా స్పిల్ వే సిద్ధం చేశారు. స్పిల్ చానెల్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రాజెక్టుకి దాదాపుగా ఓ రూపు వ‌చ్చిన‌ట్టుగా అంతా భావించే ప‌రిస్థితి వ‌చ్చింది. అయినా అదంతా డ్రామాగా దేవినేని ఉమాకి క‌నిపించ‌డం మాత్రం గ‌మ‌నార్హం. మరో వైపు వరదల్లోనూ చేస్తున్న ప‌నుల ద్వారా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 43 మీటర్ల (42.5 మీటర్లు, 0.5 ఫ్రీ బోర్డ్‌) ఎత్తుతో పూర్తిచేసినా టీడీపీ నేత‌ల‌కు క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మే..!

రివిట్‌మెంట్‌ పనులు ఈనెల 10 నాటికి పూర్తవుతాయి. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో 80 మీటర్లు మినహా 1,537 మీటర్ల పొడవున 20 మీటర్ల ఎత్తుతో పనులు చేశారు. స్పిల్‌ వే 53 పియర్స్‌ (కాంక్రీట్‌ దిమ్మెలు)ను 55 మీటర్ల ఎత్తుతో పూర్తి చేశారు. స్పిల్‌ వే 54.5 మీటర్ల ఎత్తులో 192 గడ్డర్లను ఏర్పాటు చేసి వాటిపై 1118.4 మీటర్ల పొడవుతో స్పిల్‌ వే బ్రిడ్జిని పూర్తి చేశారు. స్పిల్‌ రివర్‌ స్లూయిజ్‌లకు పది గేట్లను బిగించారు. స్పిల్‌ వేకు 48 గేట్లకుగానూ 42 గేట్లను బిగించారు. వాటిని ఎత్తడానికి, దించడానికి వీలుగా 84 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుని బిగించారు. కరోనా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో జర్మనీ నుంచి మరో 14 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్ల దిగుమతిలో జాప్యం వల్ల ఆరు గేట్లను బిగించలేకపోయారు. జర్మనీ నుంచి హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లు మూడు నెలల క్రితం వచ్చాయి. వరద తగ్గాక వాటితో మిగిలిన 6 గేట్లను బిగించనున్నారు.

Also Read:ఇక్కడ సరే.. మరి కర్ణాటకలో ఏంటి సోము సార్‌..?

ఇప్ప‌టికే స్పిల్ వే పూర్తి కావ‌డం, కాఫ‌ర్ డ్యామ్ ప‌రిపూర్ణం చేయ‌డంతో ఇప్ప‌టికే పోల‌వ‌రం ఎగువ‌న రిర్వాయ‌ర్ మాదిరిగా క‌నిపిస్తోంది. 195 టీఎంసీల నిల్వ ఉండాల్సిన గోదావ‌రి జ‌లంలో ఇప్ప‌టికే స‌గం మేర‌కు నీటిని నిల్వ చేసే అవ‌కాశం ఏర్ప‌డింది. అయితే ఈసీఆర్‌ఎఫ్ పూర్తి చేయ‌డం ప్ర‌స్తుతం ప్ర‌ధాన క‌ర్త‌వ్యంగా సాగుతున్నారు. దానికి సంబంధించి మూడు ప్యాకేజీలుగా విభ‌జించి ప‌నులు చేస్తుందడ‌గా గ్యాప్‌–1, గ్యాప్‌–2 పనులు చేప‌ట్ట‌బోతున్నారు. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–3లో 140 మీటర్ల పొడవున కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు చేపట్టి.. ఇప్పటికే ఒక కొలిక్కి తెచ్చారు. దాంతో ఇది 2022 నాటికి పూర్తికావ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. .

కాలువ‌ల ప‌నుల మీద కూడా దృష్టి పెట్టారు. అనుసంధానం చేసే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. కుడి కాలువ కింద మూడు లక్షలు, ఎడమ కాలువ కింద 4.2 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలను నిర్మించడానికి సర్వే పనులను పూర్తిచేశారు. నవంబ‌ర్ నాటికి డీపీఆర్ సిద్ధం చేసి టెండ‌ర్లు పిలిచేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. విద్యుత్ ప్లాంట్ ప‌నులు, నిర్వాసితుల‌కు పున‌రావాసం స‌హా అన్ని ప‌నులు ఏక‌కాలంలో చేప‌ట్టేలా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది.

Also Read:ప‌వ‌న్ పై గెలిచిన ఆ ఇద్ద‌రిలో ఒక‌రికి జ‌గ‌న్ కేబినెట్లో చోటు?

అదే స‌మ‌యంలో కేంద్రం నుంచి నిధులు పెంచ‌డానికి అనుగుణంగా డీపీఆర్ కి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం ద‌క్కాల్సి ఉన్న‌ప్ప‌టికీ అందులో జాప్యం జ‌రుగుతోంది. కేంద్రం ఉదారంగా వ్య‌వ‌హ‌రిస్తే ప్రాజెక్టు ప‌నులు మ‌రింత వేగంగా సాగ‌డం ఖాయం. ప్ర‌భుత్వం చెప్పిన స‌మ‌యానికి ప‌నులు పూర్తి చేయ‌డం సులువ‌వుతుంది. అయినా కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం ఈ విష‌యంలో చొర‌వ చూప‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. అయినా టీడీపీ నేత‌లు మాత్రం కేంద్రం చేస్తున్న అల‌స‌త్వం గురించి ప‌ల్లెత్తుమాట అనకుండా జ‌గ‌న్ ని, ఇరిగేష‌న్ మంత్రి ని విమ‌ర్శించ‌డం విడ్డూర‌మే కాకుండా, వారి ల‌క్ష్యాన్ని చాటుతోంది. పోల‌వ‌రం పూర్తి చేయాల‌నే ల‌క్ష్యంతో కాకుండా కేవ‌లం జ‌గ‌న్ హ‌యంలో ప‌నులు జ‌ర‌గ‌కూడ‌ద‌నే ఉద్దేశ‌మే టీడీపీ నేత‌ల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.