iDreamPost
iDreamPost
దేవినేని నెహ్రు కుమారుడు,గత ఎన్నికల్లో గుడివాడ నుంచి కొడాలి నాని మీద టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన దేవినేని అవినాష్ గత రెండు రోజులుగా టీడీపీ శ్రేణులకు అందుబాటులో లేడు. ఇసుక కొరత మీద విజయవాడలో రేపు చంద్రబాబు నిర్వహించనున్న దీక్ష ఏర్పాట్లలో కూడా అవినాష్ పాల్గొనటంలేదు. దీనితో అవినాష్ పార్టీ మారుతున్నాడన్న ప్రచారం జరుగుతుంది.
ఎన్టీఆర్ కు అనుంగ శిష్యుడైన దేవినేని నెహ్రు వైశ్రాయ్ సంఘటన సమయంలోను, ఆ తరువాత కూడా ఎన్టీఆర్ వర్గంలో కొనసాగారు. 1996 ఎన్నికల్లో లక్ష్మి పార్వతి వర్గం తరువున విజయవాడ ఎంపీగా పోటీచేశారు. ఆ ఎన్నికల తరువాత లక్ష్మి పార్వతి వర్గం బలహీనపడటంతో నెహ్రు కాంగ్రెసులో చేరి 2014 ఎన్నికలు ముగిసిన తరువాత చంద్రబాబుతో ఉన్న చిరకాల శత్రుత్వాన్ని పక్కనపెట్టి టీడీపీలో చేరారు. తన వారసుడు దేవినేని అవినాష్ రాజకీయ భవిష్యత్తు కోసమే నెహ్రు చంద్రబాబుతో రాజీపడి టీడీపీలోకి వెళ్లారు.
నెహ్రు కల సాకారం కాలేదు.మొన్నటి ఎన్నికల్లో అవినాష్ గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కొడాలి నాని మీద ఓడిపోయారు.టీడీపీకి కంటిలో నలుసులా తయారైన కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో టీడీపీలోని నాని సామాజిక వర్గ ప్రముఖులంతా అవినాష్ కు హార్దికంగా,ఆర్ధికంగా దన్నుగా నిలిచారు.ఒకదశలో అవినాష్ పెడుతున్న ఖర్చు ముందు నాని తట్టుకుంటారా?అన్న అనుమానం గుడివాడ ఓటర్లలో కలిగింది.కృష్ణా జిల్లాలోనే ఓటుకు అత్యంత ఎక్కువ మొత్తం గుడివాడలో పంచారు. కానీ నాని ప్రజాబలం,వైసీపీ హవా ముందు టీడీపీ ప్రణాళికలేవి పనిచేయలేదు.
గన్నవరం వంశీ పార్టీ మారతాడని ప్రచారం జరిగింది.వంశీ వ్యవహారశైలి కూడా ఆ ప్రచారాన్ని బలపరిచే విధంగా ఉండేది. దీనితో గన్నవరం నుంచి వంశీని తప్పించాలని కొందరు టీడీపీ నాయకులు చంద్రబాబును కోరారు. అప్పుడు వంశీకి ప్రత్యామ్నాయంగా దేవినేని అవినాష్ ను పరిగణించారు.చివరికి వంశీకి గన్నవరం టికెట్ ఇచ్చి అవినాష్ ను గుడివాడ బరిలోకి దించారు. అవినాష్ గుడివాడ నుంచి ఇష్టపూర్వకంగా పోటీచేయలేదు.2019లో విజయవాడ తూర్పు నుంచి గెలిచిన గద్దె రామ్మోహన్ 1994లో గన్నవరం నుంచి గెలిచారు. గద్దె రామ్మోహన్ను గన్నవరంకు పంపి తనకు తూర్పు టికెట్ ఇవ్వవలసిందిగా అవినాష్ కోరారు.అది కానీ పక్షంలో తన ఇంటి పరిసర ప్రాంతాలు గన్నవరం నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి కాబట్టి కనీసం గన్నవరం టికెట్ ఇవ్వలసిందిగా చంద్రబాబును కోరారు. వైసీపీ సునామీలో కృష్ణా జిల్లాలో టీడీపీ కేవలం దేవినేని అవినాష్ కోరుకున్న గన్నవరం,విజయవాడ తూర్పు నియోజకవర్గాలు మాత్రమే గెలవటం యాదృచ్చికం అనలేము,అక్కడి బలాబలాలు తెలుసు కాబట్టే అవినాష్ ఆ నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేయాలనుకున్నాడు.
ఇంక విషయానికి వస్తే గత కొంతకాలంగా అవినాష్ రాజకీయంగా క్రియాశీలకంగా లేడు. ముఖ్యంగా ఈ నెల 14న విజయవాడలో చంద్రబాబు దీక్ష చేస్తున్నానని ప్రకటించినా గతంలో అన్నీ తానై నడిపించిన అవినాష్ దీక్ష ఏర్పాట్లలో కనిపించలేదు.నెహ్రు కుడిభుజాలుగా వ్యవహరించిన దేవినేని రమణ,బాజీ ప్రసాద్,పండు (ఈ ముగ్గురు చనిపోయారు ),కడియాల బుచ్చిబాబులలో నెహ్రూ వర్గంతో కొనసాగుతూ, ఇప్పుడు అవినాష్ కు రాజకీయ సలహాదారుడిగా వ్యవహరిస్తున్న కడియాల బుచ్చిబాబు వైసీపీలోకి చేరుదామని కొంతకాలంగా అవినాష్ కు చెప్తున్నాడు.
వైసీపీ కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నాయకత్వాన్ని మారుస్తుందన్న ఊహాగానాలున్నాయి. చిరకాల ప్రత్యర్థి వంగవీటి రాధ ఎన్నిక ముందే వైసీపీని వీడటంతో వైసీపీలో తనకు వర్గ పోరు ఉండదని, యలమంచలి రవి వైసీపీలో ఉన్నా ఆయనతో ఇబ్బంది ఉండకపోవొచ్చని అవినాష్ భావించవొచ్చు. మరి కొన్ని గంటలలో అవినాష్ ఒక నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు చెప్తున్నారు. అవినాష్ వైసీపీలో చేరుతాడా లేక వంశీ చేరికలాగా పెండింగ్ పడుతుందా? ఒకవేళ చంద్రబాబు ఒత్తిడితో అవినాష్ దీక్షలో పాల్గొన్నా ఎక్కువరోజులు టీడీపీలో కొనసాగడని చెప్తున్నారు.