iDreamPost
android-app
ios-app

ఆందోళన పెంచుతున్న కరోనా గణాంకాలు

  • Published Sep 15, 2020 | 6:42 AM Updated Updated Sep 15, 2020 | 6:42 AM
ఆందోళన పెంచుతున్న కరోనా గణాంకాలు

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కోవిడ్‌ 19 మహమ్మారి కారణంగా 9,17,417 మంది మృతి చెందారు. ప్రతి రోజూ నమోదయ్యే మరణాల సంఖ్య పెరుగూ ఉండడంతో ప్రçస్తుతం ప్రపంచదేశాలను ఆందోళన పరుస్తోంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడులక్షలకుపైగా కేసులు నమోదై ఇప్పటి వరకు అత్యధికంగా కేసులు నమోదైనట్లు రికార్డుల్లోకెక్కింది.

గత ఆరు నెలలుగా ప్రతి రోజూ ఒక్కో రికార్డును మెరుగుపరుచుకుంటూ దూసుకుపోతున్న కరోనా మహమ్మారి ధాటికి సర్వస్వం అతలాకుతలైపోతోంది. మున్ముందు భారత్‌లో కేసుల తీవ్రత మరింత తీవ్రం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌వో) సైతం ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్థితిని అర్దం చేసుకోవచ్చు. గతంలో అమెరికా, బ్రెజిల్‌లలో అత్యధిక కేసులు నమోదవుతూ ఆందోళనపర్చగా ఇప్పుడు ఆ వంతు భారత్‌కు వచ్చింది. అమెరికాలు 45వేలు, బ్రెజిల్‌లో 43వేలకుపైగా పాజిటివ్‌లు నమోదవ్వగా భారత్‌లో తీవ్ర ఆందోళనకర రీతిలో ఏకంగా 94వేలకుపైగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూసాయి.

దీంతో భవిష్యత్‌ పరిస్థితులపై సర్వత్రా భయాలు నెలకొంటున్నాయి. ఈ స్థాయి పెరుగుదల ఈ నెలలోనే ప్రారంభమైది కాకపోవడం ఇంకాస్త ఆందోళన పెంచుతోంది. గత నెలైన ఆగష్టులో దాదాపు ఇరవైలక్షల కేసులు నమోదైనట్లు ప్రభుత్వ బులిటెన్‌లను బట్టి తెలుస్తోంది. దాదాపు అన్ని దేశాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ భారత్‌లో పెరుగుతున్న తీరు పట్ల వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారత్‌లో లాక్డౌన్‌ నిబంధనలను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రపంచంలోని పలు దేశాల్లో కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇంకొన్ని దేశాల్లో లాక్డౌన్‌ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలకు కూడా దిగుతున్నారు.

అయితే వ్యాప్తి ప్రారంభంతోపోలిస్తే దీనిని ఎదుర్కొనేందుకు వైద్య రంగం దాదాపు సంసిద్ధమైందనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటిప్పుడు వ్యాధి నుంచి ప్రాణాలను కాపాడే విధానాలపై చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడే మెరుగైన వైద్యం అందించేందుకు ప్రాధాన్యత పెరిగింది. ఈ కారణంగానే మరణాల రేటు తగ్గుతోందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా భారిన పడకుండా వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యమివ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.