iDreamPost
android-app
ios-app

‘వైఎస్సార్‌ రైతు భరోసా’ పై ప్రత్యేక స్పందన

‘వైఎస్సార్‌ రైతు భరోసా’ పై ప్రత్యేక స్పందన

‘వైఎస్సార్‌ రైతు భరోసా’ అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 9వ తేదీన మండల, డివిజన్, జిల్లా కేంద్రాల వారీగా ప్రత్యేకంగా ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రెండో శనివారం సెలవు రోజు అయినప్పటికీ అన్నదాతల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రైతు భరోసాకి సంబంధించి సందేహాలను తీర్చాలని..అర్హులైన ఏ ఒక్కరికీ పథకం ద్వారా లబ్ధి చేకూరలేదనే విమర్శలు రాకుండా చూడాలని సూచించారు. రైతులు, కౌలు రైతుల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. నవరత్నాలలో భాగంగా చేపట్టిన వైఎస్సార్‌ రైతు భరోసా పథకం అమలుపై బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 

అర్హులందరికి అందివ్వాలి.. 

అర్హులైనప్పటికీ భూ యజమానులైన కొందరు రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేయడంలో సమస్యలు ఏమిటని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ప్రశ్నించారు. ఆధార్‌ కార్డు కాపీలు సమర్పించకపోవడం, వెబ్‌ల్యాండ్‌లో నంబర్లు సరిగా లేకపోవడం, పట్టాదారు పాస్‌ పుస్తకంలో ఉన్న బ్యాంకు ఖాతాలు ఆధార్‌ సీడింగ్‌ కాకపోవడం తదితర కారణాలతో అర్హులైనప్పటికీ కొందరు రైతులకు రైతు భరోసా పథకాన్ని వర్తింప చేయలేకపోయినట్లు అధికారులు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ స్పందిస్తూ అర్హులైన ఏ ఒక్క రైతుకుగానీ కౌలు రైతుకు గానీ రైతు భరోసా పథకం అందలేదన్న విమర్శ ఉండకూడదని స్పష్టం చేశారు. 

ఇప్పటిదాకా 40,84,738 మందికి లబ్ధి

అక్టోబర్‌ 15వతేదీ నుంచి ఇప్పటివరకు రూ.3,256.41 కోట్లను 40,84,738 మంది రైతులు, కౌలు రైతుల ఖాతాలకు జమ చేసినట్టు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఈనెల 15లోగా మరో 2.99 లక్షల మంది దేవదాయ, ఈనాం, అటవీ భూములు, సర్వే చేయని భూములను సాగు చేసుకుంటున్న కౌలు రైతులు, గిరిజనులకు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేలా చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు కూడా సాయం అందిస్తున్నట్టు వివరించారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా లబ్దిదారులతో పాటు తిరస్కరించిన వారి జాబితాను కూడా ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్టు తెలిపారు. 

కౌలు రైతులకు డిసెంబర్ 15 వరకు గడువు 

రబీ సీజన్‌ ఇప్పుడే మొదలు కావడం.. రైతులు, కౌలు రైతుల్లో అవగాహన పెరిగి ఇప్పడిప్పుడే సాగు ఒప్పందాలు చేసుకుంటున్నందున కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించే గడువును డిసెంబర్‌ 15 వరకు పెంచాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. సాధారణ రైతులకు నవంబర్‌ 15లోగా రైతు భరోసా సాయాన్ని అందించాలన్నారు. రైతుల సందేహాలను తీర్చేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు.