iDreamPost
iDreamPost
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన యేడాది తర్వాత జరిగిన ఎన్నికల్లో మొదట గ్రామ పంచాయతీల్లో అపూర్వ విజయం సాధించింది. గ్రామీణ ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపడానికి అనేక కారణాలు చెప్పారు. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే ఈ విజయాన్ని సమకూర్చాయి అనుకోవడానికి లేదు.
ఇక గ్రామాల ఎన్నికల తర్వాత వచ్చిన పురపాలక (పట్టణ) ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా ఉంటాయని కొందరు విశ్లేషకులతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆశించాయి. పట్టణాల్లో ఓటర్లు చదువుకున్నవారు ఉంటారని, వారికి పరిపాలనలో మంచిచెడ్డలు తెలుస్తాయని, రెండేళ్ళుగా సాగుతున్న జగన్ పాలనలో వైఫల్యాలు పట్టణ ఓటర్లకు అర్ధం అవుతాయని, ఎన్నికల తీర్పు భిన్నంగా ఉంటుందని భావించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకేసి జగన్ తీసుకున్న రాజధాని వికేంద్రీకరణ నిర్ణయానికి మున్సిపల్ ఎన్నికలు రెఫరెండం అవుతాయని ప్రకటించారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతం అయిన విజయవాడ, గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు రెండు నగరాల ఓటర్లకు చురకలేసి, హెచ్చరిక కూడా చేశారు. విజయవాడ, గుంటూరులో జగన్ పార్టీని గెలిపిస్తే అమరావతి ఉండదని హెచ్చరించారు. షుమారు 450 రోజులుగా అమరావతి పేరుతో ఉద్యమం నడుస్తోంది. ఈ ఉద్యమానికి టీడీపీ తో పాటు ఆ పార్టీకి అండగా నిలిచిన మీడియా కూడా అమరావతి ఉద్యమాన్ని రోజూ మోస్తూనే ఉంది. అయినా పట్టణ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి విజయవాడ, గుంటూరు ప్రజలు జగన్ పార్టీకే పట్టం కట్టారు.
ఈ విజయానికి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కారణం కాదు అని స్పష్టంగా చెప్పొచ్చు. ప్రభుత్వం చేస్తున్న నేరుగా నగదు బదిలీ కొంత ఉపసమనంగా ఉన్నా అన్నింటికీ మించి, జగన్ విమర్శకులు అంగీకరించని అనేక అంశాలు ఈ విజయాన్ని సాధించిపెట్టాయి.
వృద్ధులకు ఇంటివద్దకే పింఛన్ తెచ్చి ఇవ్వడం జగన్ వ్యతిరేకులు, విమర్శకులు అందుకోలేని ఓ పాజిటివ్ భావనను క్రియేట్ చేసింది. ఇక గ్రామ, వార్డు సచివాలయాలు మొత్తంగా ప్రజలకు తమ అవసరాలకోసం దూరం వెళ్ళాల్సిన భారం తగ్గించి ఓ రిలీఫ్ ఇచ్చింది. బడుల్లో, అంగన్వాడీల్లో, ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులు, వాటి ఫలితాలు కళ్ళముందే కనిపిస్తున్నాయి. చాలా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు వెలసి పనిచేయడం కూడా కళ్ళముందే కనిపిస్తోంది. ఇవన్నీ జగన్ పనితీరుకు నిలువెత్తు నిదర్శనలుగా కళ్ళముందు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఓటర్లు ఈ సారి నాడు-నేడు లో కొత్తరూపు దిద్దుకున్న పాఠశాలల్లోనే ఓట్లేశారు. రెండేళ్ళలో మారిన తమ పాఠశాల పోలింగ్ గది ఓటరును ప్రభావితం చేయకుండా ఉంటుందా!?
ప్రజలను జగన్ గెలుచుకున్న మరో మంచి నిర్ణయం ప్రజలకు, తరతమ భేదం లేకుండా పంచి ఇచ్చిన ఇళ్ళ స్థలాలు. ఇది గ్రామీణ, పట్టణ ప్రజలను బాగా ప్రభావితం చేసింది. ఇళ్ళస్థలాలు జగన్ ఇస్తాడు అనే భరోసా పట్టణ ప్రజల్లో కూడా కలిగింది.
వీటన్నిటికీ మించి గత ఏడాదిగా జగన్ ప్రభుత్వం కరోనా పట్ల స్పందిస్తున్న విధానం పట్టణ ప్రజలు ఆలోచించేలా చేసింది. కరోనాను కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వ చర్యలకు ప్రజాలనుండి సంపూర్ణ మద్దతు వచ్చింది. జగన్ నిర్ణయాలు, చర్యలవల్ల రాష్ట్రంలో కరోనా గురించిన భయం, ఆందోళన ప్రజల్లో తగ్గింది. కరోనా వ్యాధి నివారణ మాత్రమే కాదు టీకా పంపిణీకి జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు పట్టణ ప్రజలను చాలా ఎక్కువగానే ప్రభావితం చేశాయి.
ఈ చర్యలన్ని ఒక ఎత్తయితే, జగన్ మొదలు పెట్టిన సోషల్ ఇంజినీరింగ్ మరో ఎత్తు. గత రెండేళ్ళలో రాష్ట్రంలోని అనేకానేక కులాలు మొదటిసారిగా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పైకి వచ్చాయి. దశాబ్దాలుగా కనీస గుర్తింపులేని అనేక కులాలకు జగన్ రాజకీయ గుర్తింపు ఇచ్చారు. ప్రత్యేకించి బీసీల్లో 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి షుమారు 200 మంది మొదటిసారిగా రాజకీయాలు చవిచూస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ళకు కేవలం జగన్ వల్లనే తమకు రాజకీయ గుర్తింపు వచ్చిందనే భావన ఈ కులాల్లో కలిగింది. ఈ కులాలకు ప్రాతినిధ్యం కల్పించడం కూడా కొన్ని ప్రోగ్రెస్సివ్ కులాల్లో ఓ చర్చనీయాంశం కావడం, అది అనేక కులాలను ప్రభావితం చేయడం ఈ ఎన్నికల్లో జగన్ కు అనుకూలించింది.
బీసీల్లోనే కాదు జగన్ ఎన్నికైన నాటినుండి, ఇంకో మాటలో చెప్పాలంటే ఎన్నికల ప్రక్రియలోనే తనదంటూ ఓ ప్రత్యేక సోషల్ ఇంజినీరింగ్ అమలులోకి తెచ్చారు. ఎన్నికల ముందు టిక్కెట్ల కేటాయింపు నుండి ఎన్నికల తర్వాత మంత్రివర్గ కూర్పు, ఆ తర్వాత రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల్లో జగన్ తనదైన శైలిలో సోషల్ ఇంజినీరింగ్ అమలు చేయడం, చాలా కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడం ప్రజల్లో ప్రత్యేక అభిమానాన్ని కూడబెట్టింది.
ఒక కులం పట్ల ప్రత్యేక అభిమానం చూపించడం కాకుండా అన్ని కులాలను కలుపుకుపోవడం, అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఇతర కులాలకు ప్రాధాన్యత కల్పించడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జగన్ లో తాము గమనించింది ఎన్నికల వేళ గుర్తుపెట్టుకుని తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మొత్తంగా ఈ ఎన్నికలు, ఈ ఏకపక్ష విజయం జగన్ సోషల్ ఇంజనీరింగ్ తో పాటు జగన్ పాలనా తీరుకు ప్రజలు తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపినట్టుగా, ఆయన నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్టుగా చూడాల్సిందే.