అధికారులతో సమీక్షలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెప్పే మాట పరిపాలనా విధానంలో గత ప్రభుత్వాలకు, ఇప్పటికి మార్పు చూపాలని. నాడు – నేడు తేడాను ప్రజలు గుర్తించేలా చేయాలని. సంక్షేమ ఫలాలు అందించడంలోనే కాదు.. వాటి అమలు తీరును తెలుసుకునేందుకు తనపై తానే సవాలు విసురుకుంటున్నారు జగన్. ఏడాది పాలనలో నెరవేర్చిన, చేసిన అంశాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టుతో పాటు మేనిఫెస్టోను ధైర్యంగా ప్రజల వద్దకు పంపుతున్నారు. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ చేయని, చేయలేని సాహసాన్ని జగన్ చేస్తున్నారు. మేనిఫెస్టోను ఓ భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావిస్తానని చెప్పిన ఆయన మనసావాఛ ఆచరిస్తున్నారు. చెప్పినవి, చేయనవి కూడా ప్రజల అవసరాలను బట్టి నెరవేరుస్తున్నారు. గత ప్రభుత్వం 2014 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలతో కూడిన మేనిఫెస్టోను ఎన్నికల సమయంలో ఏకంగా పార్టీ వెబ్సైట్ నుంచి కనిపించకుండా మాయం చేస్తే.. గత ప్రభుత్వ విశ్వసనీయతకు, ఇప్పటి ప్రభుత్వ విశ్వసనీయతకు మధ్య ఉన్న తేడా ఇదే అంటూ మేనిఫెస్టోను ప్రజలకు చేరవ చేస్తూ జగన్ నిరూపిస్తున్నారు.
ఇప్పటి వరకూ 78,54,563 బుక్లెట్ల పంపిణీ
మేనిఫెస్టోలో ఏమి చెప్పాం.. ఏడాది పాలనలో ఏమి చేశాం.. అనే వివరాలతో కూడిన బుక్లెట్ను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తోంది. ఇప్పటికే 78,54,563 బుక్లెట్లను వలంటీర్లు ఇంటింటా పంపిణీ చేశారు. మిగతా బుక్లెట్ల పంపిణీని నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. మేనిఫెస్టోను ప్రజల దగ్గరకే పంపించి ఏడాది పాలనలో ఏమేం చేశాం.. ఏమి చేయలేదో ప్రజలనే చెప్పాల్సిందిగా కోరతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 129 హామీల్లో ఇప్పటికే 90.80 శాతం అమలు చేసి 3.98 కోట్ల మందికి లబ్ధి కలిగించడం అంటే మాటలు కాదు. అందుకే తాను చేసిన పనులను జగన్ ప్రజలకు నిర్భయంగా చెప్పగలుగుతున్నారు.
గుండెల నిండా జనం అజెండా
ఆ మాట మేరకు ఏడాది పాలనలో ఏమి చేశారో చెప్పడంతో పాటు 2020–21 ఆర్థిక సంవత్సర సంక్షేమ క్యాలెండర్ను, మేనిఫెస్టోను ప్రజల దగ్గరకే పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘గుండెల నిండా జనం అజెండా’ శీర్షికతో కూడిన బుక్లెట్లో తొలియేడు – జగనన్న తోడు వివరాలను పేర్కొన్నారు. మొత్తం 129 హామీల్లో ఇప్పటికే 78 హామీలు అమలు చేయగా, మరో 35 హామీలు అమలుకు సిద్ధంగా ఉన్నాయి. 16 హామీలు అమలు కావాల్సి ఉంది. ఈ లెక్కన 90 శాతం హామీలు నెరవేర్చారు. ఇవి కాక అదనంగా చేసినవి 40 అంశాలు. ఏడాది పాలనలో నవరత్నాల ద్వారా 3.98 కోట్ల మందికి రూ.41,718 కోట్ల మేర సాయం అందించినట్లు బుక్లెట్లో స్పష్టం చేశారు.