iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఎవరు ఎన్ని చెప్పినా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రావడానికి, అభివృద్ది కావడానికి కారణం తనే అని చెప్పుకోవడంలో ఏమాత్రం వెనకడుగు వేయరు. గతంలో ఒకానొక సమయంలో అసెంబ్లీలో సైతం ప్రపంచంలో మొట్టమొదట ఐటీని ప్రమోట్ చేసింది తానే అని కూడా చెప్పి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్య పరిచారు. ఆయన మాటలు చూస్తే నిజంగానే హైదరాబాద్ అనే ఒక నగరానికి చంద్రబాబు లేకపోతే ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చేవి కావా అనే అనుమానం కూడా కలుగుతుంది.
నిజానికి చంద్రబాబు హైదరాబాద్ పై చెప్పే కబుర్లు అసత్యాలు అభూతకల్పనలు అని పలువురు ఎన్నిసార్లు సాక్షాలతో చూపినా ఆయన ఆ నిజాలను పెద్దగా పట్టించుకొన్నట్లు కనిపించలేదు. తాజాగా హైదరాబాద్లో జరుగుతున్న గ్రేటర్ ఎన్నిక్కల్లో టీడీపీ తరపున అభ్యర్థులని నిలబెట్టిన చంద్రబాబు తానే హైదరాబాద్లో ఐటీకి ఆద్యుడ్ని అని చెబుతూ ఓట్లు అడిగే ప్రయత్నం మొదలు పెట్టారు. ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా సాప్ట్ వేర్ రంగం ప్రస్థానం మొదలైందే హైటెక్ సిటీ నుంచే అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మరొకసారి చేశారు .
Also Read: అధినేత తీరుతో టీడీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
హైదరాబాద్ లోని సైబర్ టవర్స్ ఉన్న ప్రాంతంలో సాఫ్ట్ వేర్ హబ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసింది స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన రెడ్డి. సైబర్ టవర్స్ బిల్డింగ్ వచ్చింది నారా చంద్రబాబు హయాంలో. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్ శివారు ప్రాంతంగా ఉన్న నానక్ రాం గూడ వరకు విస్తరించటానికి కారణం దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖరర్ రెడ్డి. రాజీవ్ గాంధీ హత్య మొదటి వర్ధంతి 21-May-1992న రాజీవ్ దార్శనికతకి, టెక్నాలజీకి ఇచ్చిన ప్రాముఖ్యతను చిహ్నంగా అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు స్వయంగా ఇప్పటి సైబర్ టవర్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో దాని నిర్మాణ అంచనా వ్యయం 4.5 కోట్లు. ఈ వ్యవహారాలని పర్యవేక్షించటానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దానికి పార్ధసారధి ఎండిగా వ్యవహరించేవారు. అప్పుడే అనేక అమెరికా కంపెనీలు ఇక్కడ తమ వ్యాపారకార్యకలాపాల నిర్వహణకు సంసిద్దం వ్యక్తం చేశాయి. ఒక హార్డ్వేర్ పార్క్ నిర్మాణానికి జపాన్ కంపెనీ కూడా ముందుకు వచ్చింది. 400 కోట్ల సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల వార్షిక ఎగుమతుల లక్ష్యాన్ని కూడా నిర్ధేశించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 ప్రముఖ కంపెనీలకు లేఖలు రాసి, రాష్ట్రం కల్పించే ఐటి సదుపాయాలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. భవిష్యత్తులో హైదరాబాద్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ కు, చిప్ డిజైనింగ్ కు కేంద్రం అవుతుందని నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు అప్పుడే జోస్యం చెప్పారు . సైబర్ టవర్స్ శంకుస్థాపన జరిగిన ఆరు నెలలకే జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటం, కోట్ల పదవిలోకి రావటం,తక్కువ సమయంలోనే ఎన్నికలు రావడం, అందులో కాంగ్రెస్ ఓడిపోవటం, ఎన్టీఆర్ గెలుపు , వైశ్రాయ్ సంఘటన… వెరసి సైబర్ టవర్స్ పనులు మరుగునుపడ్డాయి.
Also Read: చంద్రబాబుకి సస్ఫెండ్ కావడం తప్ప మరో దారి లేదు…
1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ ప్రాజెక్టు కొనసాగింపుగా అక్కడ సైబర్ టవర్స్ నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి 2004 వరకు ఐ.టిలో పెద్ద చెప్పుకోదగ్గ పురోగతి జరగలేదు. ఇప్పుడు ఎంతో రద్దీగా మారిన కూకట్ పల్లి, మాదాపూర్ , మెహదీపట్నం, గచ్చిబౌలి రోడ్లు 2004 వరకు ఎంత నిర్మానుష్యంగా ఉండేవో ఆనాడు చూసిన వారికి తెలుసు. అంతే కాకుండా ఆనాడు జరిగిన అభివృద్ది గణంకాల రూపంలో ఇప్పటికి భద్రంగా ఉంది. దాని ప్రకారం 1994 -1995 సంవత్సరంలో మూడవసారి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు మన దేశం యొక్క సాఫ్ట్వేర్ ఎగుమతులు 250 కోట్లు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 22 కోట్లు అంటే 9%. 1998-99 సంవత్సరంలో సాఫ్ట్వేర్ ఎగుమతులు 22 కోట్లు నుండి 575 కోట్లు అయింది కానీ దేశ వ్యాప్తంగా లెక్కలు వేస్తే అదే సంవత్సరం భారత దేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఎగుమతులు 6,300 కోట్లు , ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కేవలం 575 కోట్లు అంటే 9% మాత్రమే. అదే యేడు కర్నాటక సాఫ్ట్వేర్ ఎగుమతులు 2,888 కోట్లు ఉంది. నోయిడా కు సంబంధించి 1,430 కోట్లు ఉంది. తమిళనాడుకి సంబంధించి 800 కోట్లు ఉంది. ఇంక చంద్రబాబు 2004 లో దిగిపోయే సమయానికి రాష్ట్రం ఎగుమతులలో 3వ స్థానం నుండి 5వ స్థానానికి వచ్చాము.
Also Read: చంద్రబాబు కోపానికి కారణం ఇదేనా..!
గణాంకాల ప్రకారం చూస్తే చంద్రబాబు వలన హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగం పురోగతి సాదించకపోగా ఇతర రాష్ట్రాల తో పోల్చితే మరింత వెనక పడింది అనేది కాదనలేని సత్యం. వాస్తవం ఇలా ఉంది కాబట్టే 2004 ఎన్నికల్లో ఆ ఐటికి హబ్ అయిన హైదరాబాద్ జిల్లాలో ఒకే ఒక్క స్థానంకే పరిమితం అయ్యారు చంద్రబాబు గారు, 2009 గ్రేటర్ ఎన్నికల్లో చాలెంజ్ చేసి మరీ కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2016 గ్రేటర్ లో సింగిల్ స్థానానికే పరిమితం అయ్యారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గారు ఒకనొక సమయంలో పార్లమెంటు భవనం లేకపోవటం మినహా దేశ రాజధాని అవ్వటానికి అన్ని అర్హతలు హైదరాబాద్ కి ఉన్నాయని అన్నారు. ఉత్తర ధక్షిణ భేదాలు పోవాలి అంటే హైద్రాబాద్ ని భారత దేశానికి రెండో రాజధాని గా చేయటం మంచిది అన్నారు. అటువంటి హైద్రాబాద్ బాబు గారి వల్లే ప్రపంచానికి తెలిసింది అని ఆ పార్టీ వారు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం..