iDreamPost
iDreamPost
వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని ఎలాగైనా గెలిచి గిఫ్టుగా ఇస్తాను నాన్నారు.. అని చంద్రబాబుకు పెద్ద హామీనే ఇచ్చిన నారా లోకేష్ అక్కడ గెలుస్తారో లేదో గానీ.. ఆ పేరుతో ఇద్దరు పార్టీ నేతల ఆశలకు మాత్రం గండి కొడుతున్నారు. మంగళగిరిపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేత గంజి చిరంజీవిని పక్క జిల్లాలోని చీరాలకు తరిమేశారు. దాంతో ఇప్పటికే అక్కడ పార్టీ ఇంఛార్జిగా ఉన్న ఎడం బాలాజీ పరిస్థితి డోలాయమానంగా మారింది. ప్రస్తుతం అటు మంగళగిరి.. ఇటు చీరాల టీడీపీ క్యాడర్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది.
మళ్లీ త్యాగం చేయాలా?
చంద్రబాబు రాజకీయ వారసుడిగా ఎదగడానికి నానాపాట్లు పడుతున్న నారా లోకేష్ ప్రజాక్షేత్రంలోకి రాకుండానే గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయ్యి.. మంత్రి పదవి కొట్టేశారు. ఆ హోదాలోనే 2019లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన గంజి చిరంజీవి మళ్లీ పోటీ చేయాలనుకున్నా.. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి లోకేష్ కోసం అతన్ని పక్కకు తప్పించారు. అయితే ఆ ఎన్నికల్లో లోకేష్ గెలవలేదు.. రాష్ట్రంలోనూ టీడీపీ అధికారంలోకి రాలేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో మంగళగిరి కాకుండా లోకేష్ వేరే సురక్షిత నియోజకవర్గం వెతుక్కుంటున్నారని ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో గంజి చిరంజీవి మంగళగిరిలో మళ్లీ పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు.
అయితే ఇటీవల చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యాలయంలో దీక్ష చేసిన సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ 2024లో ఇదే మంగళగిరిలో గెలిచి గిఫ్టుగా ఇస్తానని సభాముఖంగా తన తండ్రికి హామీ ఇచ్చారు. ఆ మేరకు కొద్దిరోజులుగా ఆ నియోజకవర్గంలో కలియదిరుగుతూ హడావుడి చేస్తున్నారు. ఈ పరిణామాలతో చిరంజీవి గుండెల్లో రాయి పడింది. మళ్లీ త్యాగం చేయాలా అని మదనపడ్డారు. ఇటీవల లోకేష్ పర్యటన సందర్భంగా నేరుగా ఆయనతోనే తేల్చుకోవాలనుకున్నారు. తన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దానికి లోకేష్ బదులిస్తూ మంగళగిరిలాగే చేనేత సామాజికవర్గం అధికంగా ఉన్న ప్రకాశం జిల్లా చీరాలలో పోటీకి అవకాశం ఇస్తామని.. అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
అక్కడి ఇంఛార్జిని ఏం చేస్తారో..
సొంత నియోజకవర్గం.. సొంత సామాజికవర్గ బలం ఉన్న మంగళగిరిని వదిలి పక్క జిల్లాలోని చీరాలకు వెళ్లి పోటీ చేయడం కష్టం. అక్కడి పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలు తనను స్వీకరిస్తారన్న గ్యారెంటీ లేదు. చేనేత సామాజికవర్గం ఆదరిస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే గతంలో అదే సామాజికవర్గానికి చెందిన పోతుల సునీత టీడీపీ నుంచి పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓడిపోయారు. ఇవన్నీ తెలిసినా యువ బాస్ కు ఎదురు చెప్పలేక చీరాలలో తన అదృష్టం పరీక్షించుకునేందుకు చిరంజీవి అన్యమనస్కంగానే సిద్ధపడుతున్నారు.
చిరంజీవి పరిస్థితి ఇలా ఉంటే.. చీరాలలో ఇప్పటికే టీడీపీ ఇంఛార్జిగా ఉన్న ఎడం బాలాజీ కూడా ఈ పరిణామాలతో అయోమయంలో పడ్డారు. గత ఎన్నికల్లో చీరాల నుంచి కరణం బలరాం ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాలంలో ఆయన వైఎస్సార్సీపీకి దగ్గరయ్యారు. దాంతో చీరాల టీడీపీ ఇంఛార్జిగా ఎడం బాలాజీని చంద్రబాబు నియమించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారనుకుంటున్నారు. కానీ లోకేష్ మంగళగిరిలో పోటీకి సిద్ధమై.. అక్కడి నేత చిరంజీవిని చీరాలకు వెళ్లమని చెప్పడంతో.. ఎడం బాలాజీ ఇరకాటంలో పడ్డారు. ఆయన భవిష్యత్తు ఏమిటన్న చర్చ టీడీపీ శ్రేణుల్లో జరుగుతోంది. మొత్తానికి లోకేష్ తన కోసం పార్టీని నమ్ముకున్న ఇద్దరు నేతల రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేశారు.