Idream media
Idream media
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరగుతున్న నేపథ్యంలో ప్రజలు, నేతలు, మేధావుల అభిప్రాయాలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రత్యేకంగా మెయిల్ఐడీని ఏర్పాటు చేయనుంది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ దేశాలల్లో అణచివేతకు గురవుతున్న హిందూ మూలాలు కలిగిన ప్రజలకు ఏలాంటి షరతులు లేకుండా భారత పౌరసత్వం ఇచ్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పౌరసత్వ చట్టంలో సవరణలు చేసింది. అయితే ఈ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
పలు చోట్ల హింసాత్మకంగా మారాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారితో తమ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న భయంతో ఈశాన్య రాష్ట్రాల్లో మొదట ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అవి దేశమంతటా విస్తరించాయి. పోలీసులపైకి ఆందోళన కారులు రాళ్లు రువ్వడం, దుకాణాలు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం వంటి హింసాత్మక ఘటనలు చేటుచేసుకున్నాయి.
పోలీసు కాల్పుల్లో పలువురు మరణించారు.
ముఖ్యంగా ముస్లింలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. మేధావులు, ప్రజా స్వామ్య వాదులు చట్టంలోని కొన్ని అంశాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర భారత్ దేశంతోపాటు, దక్షిణ భారత్లోని కర్ణాటక, మహారాష్ట్రలో హింసాత్మక రీతిలో ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను శాంతింపజేసే లక్ష్యంతో వారి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆందోళనలు తగ్గిస్తుందా..? ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను చెరిపివేస్తుందా..? వేచి చూడాలి.