Idream media
Idream media
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు గానూ నాలుగు రాష్ట్రాలలో పోలింగ్ ముగిసింది. పశ్చిమ బెంగాల్లో మాత్రం ఎన్నికల సంగ్రామం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు దశల్లో పోలింగ్ ముగిసింది. మరో 44 స్థానాలకు శనివారం నాడు నాలుగో దశ పోలింగ్ జరగనుంది. ఉత్తర బెంగాల్లోని కూచ్బెహార్, అలీపర్దౌర్ జిల్లాల్లోనూ దక్షిణ 24 పరగణాలు, హవ్డా, హుగ్లీ జిల్లాల్లోనూ ఉన్న ఈ సీట్లున్నాయి. కేంద్ర మంత్రులు బాబుల్ సుప్రియో, ఇద్దరు బీజేపీ ఎంపీలు, ఇద్దరు బెంగాల్ మంత్రులు పార్థ చటర్జీ, అరూప్ బిస్వాస్ మొదలైన హేమాహేమీల భవిత ఈ నాలుగో దశలో తేలనుంది. 373 మంది అభ్యర్థుల జాతకాలను కోటీ 16 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. 15, 940 పోలింగ్ కేంద్రాల పహారాకు ఏకంగా 789 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.
కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయంటూ మమతా బెనర్జీ ఆరోపించడంపై ఎలక్షన్ కమిషన్ సీరియస్గా స్పందించింది. బాధ్యతరహితమైన, రెచ్చగొట్టేట్లుగా అసహనంతో కూడిన తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అంటూ ఆమెకు నోటీసులు జారీచేసింది. ఐపీసీలోని కొన్ని సెక్షన్లను ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంది. శనివారం ఉదయం 11 గంటల లోగా సమాధానమివ్వాలని కోరింది. అయితే ఈ నోటీసులను తాను లెక్క చేసేది లేదని మమత కొట్టి పడేశారు. కేంద్ర బలగాలు బీజేపీకి సహకరిస్తున్నంత కాలం, ప్రజలను స్వేచ్ఛగా ఓటేయనీయకుండా అడ్డుపడుతున్నంత కాలం తాను ఈ మాటలు అంటూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
మమత వ్యాఖ్యలు ఆమెలోని నిస్పృహను సూచిస్తున్నాయని, ఇప్పటివరకూ జరిగిన 91 సీట్ల పోలింగ్లో కనీసం 63 నుంచి 68 స్థానాలను బీజేపీ గెలుచుకోబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కాగా- మమత భద్రతా అధికారి అశోక్ చక్రవర్తిని ఈసీ శుక్రవారంనాడు ఆకస్మికంగా బదిలీ చేసింది. నాలుగోదశ పోలింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న వేళ, ఆమెకు ఓఎస్డీగా ఉన్న చక్రవర్తిపై ఈసీ వేటువేసింది. ఈ ఎన్నికల వేళ మమతా బెనర్జీ మొదటి నుంచీ బీజేపీతో పాటు ఎన్నికల సంఘంతో కూడా పోరాడుతూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు నాలుగో దశ పోలింగ్ రోజున ఈసీకి మమత ఎటువంటి సమాధానం చెబుతారో చూడాలి.