Idream media
Idream media
పేదలకు సొంతిళ్లు నిర్మించి ఇవ్వాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వ సంకల్పానికి అడుగడుగునా అడ్డు తగులుతున్న తెలుగుదేశం పార్టీపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారి సొంతింటి కల, ఇళ్ళ పట్టాల పంపిణీకి అడ్డుపడవద్దంటూ ఈ మేరకు టిడిపి అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు లేఖలు రాశారు.
హైదరాబాద్లోని ఆయన ఇంటి అడ్రస్తో లేఖలు పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్ధనపురం పోస్ట్ ఆఫీసు వద్ద మహిళలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అక్కడ నుంచి వందల మంది మహిళలు లేఖలు పంపించారు. తమ ఆవేదనను వెలబుస్తూ లేఖలు రాశారు. ఇకనైనా చంద్రబాబు వెనక్కి తగ్గాలని వేడుకున్నారు. తమకొచ్చే ఇళ్ల స్థలాన్ని, ఇళ్లును అడ్టుకోవద్దని హితవు పలికారు. తమ సొంతింటి కలను గంగపాలు చేయొద్దని హితవు పలికారు.
ఈ సందర్భంగా మహిళలు తన ఆవేదన పంచుకుంటూ.. ‘‘మాకు ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయి. 370 మందికి వచ్చాయి. ఇప్పటికే పట్టాలు చేతికి రావాల్సింది. చంద్రబాబు కోర్టుకు వెళ్లడం మూలాన అన్నీ ఆగిపోయాయి. పదిహేనో తారీఖు(ఆగస్టు)న కూడా వచ్చేదాకా నమ్మకం లేదు. దయచేసి కోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకుంటే మాకు ఇళ్లపట్టాలు వస్తాయి. ఇప్పటివరకు మాకు ఇల్లు లేదు. మీ హయాంలో మాకు సెంటు భూమి కూడా రాలేదు. ఇప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డి కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పట్టాలు ఇస్తున్నారు. అయినా గానీ మీరు అడ్డం పడుతున్నారు. దయచేసి మీరు కేసు వెనక్కి తీసుకోండి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది’’అని చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.
కాగా మార్చి 23 ఉగాది సందర్భంగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటికే ఒక రోజు (మార్చి 22)న దేశంలో కరోనా వైరస్ కట్టడికి జనతా కర్ఫ్యూ ప్రధాని మోడీ ప్రకటించారు. అనంతరం అది కొనసాగింది. మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రారంభమైంది. దీంతో ఇళ్ల స్థలాల పంపిణీ ఏప్రిల్ 8 (అంబేద్కర్ జయంతి) నాటికి వాయిదా చేశారు. అయితే కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ కొనసాగడంతో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జూలై 8న నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే.
అయితే ఈ విషయంపై తెలుగుదేశం నాయకులు గతంలో కోర్టుకు వెళ్లడంతో, ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోవిడ్ కారణంగా కేసులు డిస్పోజ్ కాకపోవడంతో.. పేదలందరికీ ఆగస్టు 15వ తేదీన ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.