iDreamPost
android-app
ios-app

AP Local Body Elections -ఏపీలో మరో ఎన్నికలకు రేపే నోటిఫికేషన్, మళ్లీ మొదలవుతున్న సందడి

  • Published Oct 31, 2021 | 2:50 AM Updated Updated Mar 11, 2022 | 10:36 PM
AP Local Body Elections -ఏపీలో మరో ఎన్నికలకు రేపే నోటిఫికేషన్, మళ్లీ మొదలవుతున్న సందడి

బద్వేలు ఉప ఎన్నికల సందడి ఇంకా పూర్తిగా తగ్గలేదు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగబోతోంది. వైఎస్సార్సీపీ విజయం ఖాయమయినప్పటికీ మెజార్టీపైనే అందరి దృష్టి ఉంది. అదే సమయంలో ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగబోతోంది. స్థానిక సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. గత మార్చిలో జరిగిన ఎన్నికల సందర్భంగా మిగిలిపోయిన మునిసిపల్ స్థానాల్లో ఎన్నికలకు రెడీ చేస్తున్నారు. వివిధ కారణాలతో నిలిచిపోయిన నగర పాలక, పురపాలక సంస్థలతో పాటుగా నగర పంచాయతీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఖాళీగా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేసే యోచనలో అధికారులున్నారు. నవంబర్ 1న దానికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణంతో వాయిదా పడితే మొదటి వారంలో మాత్రం నోటిఫికేషన్, రెండోవారంలోనే ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి.

ఏపీలో నెల్లూరు మునిసిపల్ కార్పోరేషన్ తో పాటుగా మరో 12 మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. వాటిలో కుప్పం కూడా ఉంది. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలోని మునిసిపాలిటీ చేజారిపోకుండా చూసుకునే లక్ష్యంతో ఉన్నారు. తాజా పర్యటన కూడా అందులో భాగమే. కుప్పంలో రోడ్ షో వంటివి నిర్వహించడం ద్వారా ఆయనే స్వయంగా మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం విశేషంగానే భావించాలి.

71 గ్రామాల సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. వాటితో పాటుగా 533 వార్డు, 176 ఎంపీటీసీ, 14 జెడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. సుదీర్ఘ షెడ్యూల్ కారణంగా గతంలో కరోనా సమయంలో పలువురు అభ్యర్థులు మరణించడం సహా వివిధ కారణాలతో ఈ ఎన్నికలన్నీ వాయిదా పడ్డాయి. దాంతో వాటిని వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో ఎస్ఈసీ ఉంది. దానికి అనుగుణంగా ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.

రాజమహేంద్రవరం, శ్రీకాకుళం మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే స్థానిక ఎన్నికలన్నీ పూర్తి చేసేస్తే నవంబర్ రెండో వారంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దానికి ముందుగా ఈ ప్రక్రియ జరిగిపోతే అందరికీ ఓటు హక్కు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నవంబర్ లోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ జరగబోతోంది. దాంతో దానికి ముందుగా స్థానిక ఎన్నికల్లో ఖాళీలను పూర్తిచేసేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇప్పటికే పరిషత్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన టీడీపీ ఈసారి ఖాళీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఏం చేస్తుందన్నది చూడాలి. చంద్రబాబు కుప్పం ఎన్నికల ప్రచారం రీత్యా టీడీపీ బరిలో ఉండేందుకు సన్నద్ధమవుతుందనే సంకేతాలున్నాయి. అధికార పార్టీ మాత్రం తన హవా కొనసాగించేందుకు యత్నిస్తుందనడంలో సందేహం లేదు.