iDreamPost
android-app
ios-app

రాజ‌న్న రాజ్యం మ‌ళ్లీ వ‌చ్చింది.. రైతుల‌కు భ‌రోసా దొరికింది..

రాజ‌న్న రాజ్యం మ‌ళ్లీ వ‌చ్చింది.. రైతుల‌కు భ‌రోసా దొరికింది..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రైతు సంక్షేమం అన‌గానే గుర్తొచ్చే పేరు..?
వ్యవసాయాన్ని పండగ చేసిన మహర్షిగా పేరొందిదెవ‌రు..?
ఆంధ్రప్ర‌దేశ్ లో అప‌ర భ‌గీర‌థుడిగా కీర్తి పొందిందెవ‌రు..?
వ్య‌వ‌సాయం దండ‌గ అనుకుని నిరాశ‌లో కూరుకుపోయిన రైతుల ఆశ‌లు మ‌ళ్లీ చిగురించ‌డానికి కార‌కులెవ‌రు..?

ఈ ప్ర‌శ్న‌లు విన‌గానే గుర్తొచ్చే పేరు ఒకే ఒక్క‌టి. వైఎస్. రాజ‌శేఖర్‌ రెడ్డి. ఆయ‌న మ‌ర‌ణం అనంత‌రం రైతులు నిర్వేదంలో మునిగిపోయారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డ్డ 62 శాతం మంది ప్రజలు తమ‌కు ఇన్నాళ్ల‌కు దొరికిన అండ అంద‌కుండా పోయిందా.. అని క‌న్నీరు మున్నీర‌య్యారు. ఎన్నిక‌ల ప్ర‌చార వేళ‌.. చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి ఓట్లేసిన రైతులు.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక అన్న‌దాతా సుఖీభ‌వా.. అంటే ఎంతో పొంగిపోయారు. కానీ.. ఆ ప‌థ‌కం ద్వారా మేలు జ‌రిగింది అంతంతే కావ‌డంతో నిరుత్సాహంతో కుంగిపోయారు. జీరో వ‌డ్డీ రుణాల సంగ‌తే మ‌ర‌చిపోతే.. ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌న త‌మ‌లో తామే మ‌ద‌న ప‌డ్డారు. రుణాల పేరుతో 57 లక్షల మందికి పైగా రైతుల‌కు నిరాశే మిగిలింది. ఈ బాధ‌ల‌న్నింటినీ పాద‌యాత్ర‌లో రైతులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి విన్న‌వించుకున్నారు.

రైతు భ‌రోసాతో ‌.. వెల్లివెరిసిన ఉత్సాహం…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పాద‌యాత్ర‌లో రైతుల విన‌తుల‌ను ఒక్కొక్క‌టిగా ప‌రిష్క‌రించ‌డం మొద‌లు పెట్టారు జ‌గ‌న్‌. ఈ 13 నెల‌ల కాలంలో రైతుల సంక్షేమానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌తో మ‌ళ్లీ రైతుల్లో ఉత్సాహం వెల్ల‌విరిసింది. వైఎస్సార్‌ రైతు భరోసా కింద దాదాపు రూ.10,242 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయ‌డంతో వారికి ఆర్థిక స్వాతంత్ర్యం ల‌భించింది. రైతుల కోసం నాన్న రెండడుగులు వేస్తే.. నేను నాలుగు అడుగులు వేస్తాన‌న్న మాట నిల‌బెట్టుకుని మ‌డం తిప్ప‌ని వంశ‌మ‌ని మ‌రోసారి నిరూపించారంటూ రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఏటా రూ.13,500 చొప్పున రైతుల‌కు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. 46 ల‌క్ష‌ల‌కు పైగా కుటుంబాల‌కు మేలు క‌లిగేలా చేశారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా రైతుల‌కు భ‌రోసా ఉంద‌నే న‌మ్మ‌కాన్ని రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో జ‌గ‌న్ క‌లిగించారు. 2020 – 21 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను రూ.11, 891.20 కోట్లు బ‌డ్జెట్ లో కేటాయించి భ‌ళా అనిపించుకున్నారు.

గ‌త ప్ర‌భుత్వ బ‌కాయిల‌ను సైతం…

రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎన్న‌డూ లేని నీతివంత‌మైన రాజ‌కీయాల‌ను జ‌గ‌న్ చేస్తార‌న‌డానికి ఈ నిద‌ర్శ‌నంగా స‌రిపోతుందేమో.. గత ప్రభుత్వం బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్ము రూ.1,150 కోట్లను జ‌గ‌న్ అంద‌జేశారు. 57 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆ సొమ్ము జ‌య అయ్యే విధంగా వైఎసార్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని చేప‌ట్టిన రైతు దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న చ‌ర్య‌లు చేప‌ట్టారు. దీంతో రైతుల ఆనందానికి హ‌ద్దుల్లేవ్‌. ఆ ఆనందం వారి మాట్లోనే..

జ‌గ‌న్ ను ఎన్నుకున్నందుకు గ‌ర్వ ప‌డుతున్నాం..

వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక అటువంటి పాలన మళ్లీ చూడలేమనుకున్నాం. కానీ మీరు వచ్చాక మా కష్టాలను మరిచిపోయేలా చేశారు. గతంలో ఒక ప్యాకెట్‌ విత్తనాల కోసం ఎన్నో పాట్లు పడాల్సి వచ్చేది. నేడు రైతు భరోసా కేంద్రాల ద్వారా బుక్‌ చేసుకున్న 48 గంటల్లో నేరుగా మా గ్రామానికే వస్తున్నాయి. మీలాంటి సీఎంను ఎన్నుకున్నందుకు మేం గర్వంగా ఫీలవుతున్నాం. అని విజ‌య‌న‌గ‌రం జిల్లా కాసాపేట గ్రామానికి చెందిన రైతు ఆనందం వ్య‌క్తం చేశారు. వీరే కాదు.. ఇలా చాలా మంది రైతుల ఇంట ఇప్పుడు మ‌ళ్లీ సిరుల పంట పండుతోంద‌న‌డంలో సంశ‌యం అవ‌స‌రం లేదు.